అక్కినేని నాగచైతన్య-గౌతమ్ మీనన్ కాంబినేషన్లో వచ్చిన ఏమాయ చేసావె ఒక క్లాసిక్ లాగా నిలిచిపోయింది. ఐతే వీళ్లిద్దరూ కలిసి చేసిన రెండో సినిమా సాహసం శ్వాసగా సాగిపో మాత్రం చేదు అనుభవాన్నే మిగిల్చింది. దీంతో మళ్లీ వీళ్లిద్దరూ కలిసి ఇంకో సినిమా చేయడం కష్టమే అనుకున్నారంతా. కానీ చైతూ-గౌతమ్ మళ్లీ జట్టు కడుతున్నారు. కాకపోతే ఈసారి చైతూ చేయబోయే సినిమాకు గౌతమ్ దర్శకుడు కాదు. నిర్మాత మాత్రమే.
తమిళంలో గౌతమ్ నిర్మాతగా కూడా కొన్ని సినిమాలు చేశాడు. వైవిధ్యమైన సినిమాలు తీసే యంగ్ టాలెంట్ ను ప్రోత్సహించడంలో అతను ముందుంటాడు. ఈ రోజు తెలుగులో విడుదలవవుతున్న 16 సినిమా తమిళంలో రెండు నెలల కిందట రిలీజై సంచలన విజయం సాధించింది. ఆ సినిమాతో 22 ఏళ్ల కార్తీక్ నరేన్ అనే దర్శకుడు పరిచయమయ్యాడు.తొలి సినిమాలోనే అద్భుతమైన పనితనం చూపించిన కార్తీక్ నరేన్ టాలెంటుకి గౌతమ్ ఫిదా అయిపోయాడు.
16 తరహాలోనే అతను చేయబోయే మరో థ్రిల్లర్ మూవీని తనే ప్రొడ్యూస్ చేయడానికి ముందుకొచ్చాడు గౌతమ్. ఈ సినిమా తెలుగు-తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతుంది. నాగచైతన్య.. అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో నటిస్తారు. ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చైతూ చేస్తున్న సినిమా పూర్తి కావచ్చింది.