గిరిబాబు ఓ ఇంటర్వ్యూలో అనేక ఆసక్తకర విషయాలు చెప్పారు. నాలుగు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో ఉన్న ఆయన తాను చూసిన అనేక పరిణామాలకు సంబంధించి ఆశ్చర్యకరమైన విషయాలు ఈ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన కొదమసింహం వల్ల తాను ఎలా నష్టపోయిందీ వివరించారు గిరిబాబు. తనకు వ్యక్తిగతంగా చిరంజీవితో మంచి స్నేహమే ఉందని.. అల్లు రామలింగయ్య తన కూతురిని చిరంజీవికి ఇవ్వాలనుకున్నపుడు తన గురించి చాలా పాజిటివ్ గా చెప్పినట్లు గిరిబాబు చెప్పారు. అలాగే చిరంజీవి పెద్ద స్థాయికి వెళ్తాడని తాను ముందే గెస్ చేసి ఆయనకు చెప్పినట్లు కూడా గిరిబాబు వెల్లడించారు.
కొదమసింహం కు సంబంధించిన గొడవ గురించి వివరిస్తూ.. ఆ సినిమా కంటే ముందు తాను కౌబాయ్ కథతో ‘ఇంద్రజిత్’ సినిమాను ప్రొడ్యూస్ చేశానని.. వాస్తవానికి ఆ సినిమా వచ్చిన నెల రోజుల తర్వాత ఇంద్రజిత్ రావాల్సిందని.. కానీ తన సినిమా గురించి తెలుసుకుని.. హఠాత్తుగా రాత్రికి రాత్రి రిలీజ్ డేట్ ప్రకటించి తమ సినిమాను దెబ్బ తీశారని.. కొదమసింహం ఫ్లాప్ కావడంతో ఆ ఎఫెక్ట్ తమ సినిమాపై పడిందని.. కౌబాయ్ సినిమాలు ఆడవనే అభిప్రాయం వచ్చి తమ సినిమాను సగానికి సగం రేటుకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందని.. అలా తాను చాలా నష్టపోయానని గిరిబాబు వెల్లడించారు.
ఇక చిరు తమ్ముడు పవన్ కళ్యాణ్ గురించి చెబుతూ.. అతను చాలా మంచి వ్యక్తి అని.. కానీ తనతో పని చేసే అవకాశం ఒక్కసారి కూడా రాలేదని.. పవన్ కొత్త సినిమాకు తన మనవడు పని చేస్తున్నాడని.. అతడి పనితీరుపై తెలుసుకోవడానికి యూనిట్ కు వెళ్తే పవన్ లేచి వచ్చి మర్యాదగా పలకరించాడని.. మనిద్దరం ఇప్పటిదాకా పని చేయకపోవడం ఏంటన్నాడని.. నాకు సరిపోయే పాత్ర ఏదైనా ఉందా అంటూ త్రివిక్రమ్ ను ఆరాతీశాడని.. లేదనడంతో ఊరుకున్నాడని గిరిబాబు వెల్లడించాడు. ఇక ఎన్టీఆర్.. ఏఎన్నార్.. కృష్ణల మధ్య ఒకప్పటి వైరం గురించి కూడా గిరిబాబు ఓపెనయ్యారు.