నాగచైతన్య పేరు చెప్పగానే నిష్కల్మషంగా .. నిర్మలంగా నవ్వుతూ ఉండే కుర్రాడు కళ్లముందు కదలాడతాడు. సినిమా .. సినిమాకి తనని తాను కొత్తగా ఆవిష్కరించుకునేందుకు ప్రయత్నించే పట్టువదలని కథానాయకుడిగా అనిపిస్తాడు. అలాంటి నాగచైతన్య ఇటీవల వచ్చిన 'దోచేయ్' సినిమాతో అభిమానుల హృదయాలను బాగానే దోచేశాడు. ఈ ఉత్సాహంతో వెంటనే మరో సినిమా చేయడానికి ఆయన రంగంలోకి దిగాడు. ఫలితంగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఆయన నటించే సినిమా రేపటి నుంచి చెన్నైలో ఆరంభం కాబోతోంది.
గతంలో ఆయన గౌతమ్ మీనన్ కాంబినేషన్లో చేసిన 'ఏ మాయచేశావే' సినిమా యూత్ ని ఎంతగానో ఆకట్టుకుంది. వీళ్లిద్దరి కాంబినేషన్ లో రూపొందుతోన్న ఈ సినిమా మొదటి షెడ్యూలు 45 రోజులపాటు చెన్నై లో కొనసాగుతుందని చెబుతున్నారు. ప్రేమ దృశ్యాలను అనుభూతి పరిమళంతో ఆవిష్కరించడంలోను, యాక్షన్ సన్నివేశాలను అద్భుతంగా తెరకెక్కించడంలోను గౌతమ్ మీనన్ సిద్ధహస్తుడు. కాబట్టి వీటి నేపథ్యంగానే ఈ సినిమా ఉండవచ్చని అనుకుంటున్నారు. ఈ సినిమా నాగచైతన్య కెరియర్లో చెప్పుకోదగినగా ఉంటుందనే ఆశాభావాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.