ఉన్నట్లుండి సెప్టెంబర్ 21న తన జై లవ కుశ సినిమాతో వస్తున్నట్లు ప్రకటించాడు జూ.ఎన్టీఆర్. అంతకంటే ముందే సెప్టెంబర్ 27న స్పైడర్ సినిమాతో వస్తున్నాం అని చెప్పారు మహేష్ బాబు అండ్ టీమ్. అదే విధంగా సెప్టెంబర్ 29న పైసా వసూల్ సినిమాతో వస్తున్నట్లు బాలయ్య అండ్ పూరి జగన్ లు ప్రకటించారు. ఇంతకీ ఎవరొస్తున్నారు? ఎవరు రావట్లేదు? ఎవరొస్తే ఏమవుతుంది?
నిజానికి అందరికంటే ముందే స్పైడర్ సైడ్ నుండి చాలా డేట్లు వినిపించాయి. చివరగా దసరా నాడు మా సినిమాతో రావాలని అనుకుంటున్నాం అంటూ మహేష్ బాబు ప్రకటించాడు. అయితే అది అక్టోబర్లో దసరా పండగనాడు కాకుండా.. ఓ 20 రోజుల ముందే సెప్టెంబర్ చివరి వారంలో అని చెప్పేశారు టీమ్. అందుకే 27 అనే డేట్ లాక్ చేసుకున్నారట. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాకంటే ఒక వారం ముందుగా.. సెప్టెంబర్ 21న లాక్ చేసుకున్నాడు. ఎప్పటి నుండో పైసా వసూల్ ను సెప్టెంబర్ 29కి లాక్ చేసి.. ఆ దిశగా పని ఇరగదీస్తున్నాడు పూరి. కాబట్టి ప్రస్తుతానికి మూడు రిలీజులూ కన్ఫామ్ అనే అనుకోవాలి.
ఈ లెక్కన చూసుకుంటే.. ఒకవేళ జై లవ కుశ కు బ్లాక్ బస్టర్ టాక్ వస్తే.. ఆ మరుసటి వారంలో స్పైడర్ అండ్ పైసా వసూల్ రావాలంటే మాత్రం కాస్త ధియేటర్ల సంఖ్యలో ఇబ్బందులు తలెత్తే ఛాన్సుంది. ఒకవేళ జై లవ కుశ తేడాపడితే.. మహేష్ అండ్ బాలయ్యకు ధియేటర్లు సరిపోతాయి. ఆల్రెడీ గతంలో డిక్టేటర్.. నాన్నకు ప్రేమతో సినిమాలో ఒక్క రోజు గ్యాపులో వచ్చేశాయి కాబట్టి.. ఇప్పుడు వారంరోజుల గ్యాపులో రావడానికి జూనియర్ కు పెద్దగా ఇబ్బందేం ఉంటుంది? సో జూనియర్ ఈ పోటీ నుండి తప్పుకుంటాడని అనుకోలేం. 120 కోట్ల బడ్జట్ సినిమా కాబట్టి.. మహేష్ కు కూడా టోటల్ దసరా హాలిడేస్ చాలా ముఖ్యం. పైగా సైన్స్ ఫిక్షన్ కథ కాబట్టి.. స్కూల్ కిడ్స్ ను ఎక్కువగా టార్గెట్ చేసే ఛాన్సుంటుంది. సో మహేష్ కూడా తప్పుకోడనే అనుకోవాలి.