దేశవ్యాప్తంగా అందరి దృష్టీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనయురాలు ఇవాంకా ట్రంప్ భారత పర్యటన మీదే ఉంది. ముఖ్యంగా ఆమె పర్యటించబోయే హైదరాబాద్ నగరంలో ఎక్కడా చూసినా ఆమె గురించే చర్చ జరుగుతోంది. ఆమె నగరంలో పర్యటించే రోడ్లన్నింటినీ అందంగా ముస్తాబు చేసి పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఆమె కోసం భారీ స్థాయిలో భద్రత ఏర్పాట్లు కూడా చేశారు. నగరంలో ఎక్కడ చూసినా ఇవాంకాకు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు వెలిశాయి. మొత్తంగా ఇవాంకా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోంది.
ఈ నేపథ్యంలో గురువారం రిలీజ్ కాబోయే ఇంద్రసేన చిత్ర బృందం కూడా తమ సినిమా ప్రచారానికి ఇవాంకాను వాడేసుకుంటోంది. వెల్కం టు హైదరాబాద్ ఇవాంకా ట్రంప్ అంటూ పోస్టర్ మీద అందమైన ఇవాంకా ఫొటో ఒక వైపు.. హీరో విజయ్ ఆంటోనీ టెర్రిఫిక్ లుక్ లో ఉన్న ఫొటో మరోవైపు పెట్టి పోస్టర్ డిజైన్ చేసింది ఇంద్రసేన టీం. ఆకర్షణీయంగా ఉన్న ఈ పోస్టర్ ను సోషల్ మీడియాలో రిలీజ్ చేయడమే కాక.. నగరంలో పలుచోట్ల ఇదే డిజైన్ తో ఫ్లెక్సీలు కూడా పెట్టారు. ఈ ప్రచారం భలే ఉందే అంటూ కామెంట్లు చేస్తున్నారు జనాలు. శ్రీనివాసన్ అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఇంద్రసేన పై అటు తమిళంలో.. ఇటు తెలుగులో మంచి అంచనాలే ఉన్నాయి. దీని ట్రైలర్ అందరి దృష్టినీ ఆకర్షించింది.