శ్రీమంతుడు కథా చౌర్యం విషయంలో తలెత్తిన వివాదం కొంచెం సీరియస్ టర్నే తీసుకుంటోంది. ఈ కేసు విషయమై ఇప్పటికే ఆ చిత్ర కథానాయకుడు మహేష్ బాబు.. దర్శకుడు కొరటాల శివలకు నోటీసులు జారీ చేసిన కోర్టు.. తాజాగా వాళ్లిద్దరూ కోర్టుకు హాజరు కావాలని ఆదేశాలిచ్చింది. మార్చి 3న కోర్టులో హాజరుకావాలని మహేశ్ బాబు.. కొరటాల శివలతో పాటు శ్రీమంతుడు నిర్మాత ఎర్నేని సునీల్ లకు నాంపల్లి 6వ మెజిస్ట్రేట్ కోర్టు సమన్లు జారీ చేసింది. తాను రాసిన చచ్చేంత ప్రేమ నవల ఆధారంగానే శ్రీమంతుడు సినిమా తీశారని రచయిత శరత్ చంద్ర ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అతడి పిటిషన్ ను విచారించిన కోర్టు మహేష్.. కొరటాలకు సమన్లు ఇచ్చింది.
తన నవలను కాపీ కొట్టి ?శ్రీమంతుడు? సినిమా తీశారని ఆరోపిస్తూ ముందు రచయితల సంఘానికి ఫిర్యాదు చేసిన శరత్ చంద్ర.. అక్కడ తనకు న్యాయం జరగకపోవడంతో కోర్టును ఆశ్రయించినట్లు చెబుతున్నాడు. మధ్యలో డబ్బులు సెటిల్ చేయించేందుకు కూడా ప్రయత్నాలు జరగాయని.. ఐతే తనకు డబ్బు వద్దని.. క్రెడిట్ కావాలని అతనంటున్నాడు. హృతిక్ రోషన్ హీరోగా హిందీలో రానున్న ?శ్రీమంతుడు? రీమేక్ టైటిల్స్ లో తనకు కథా రచయితగా క్రెడిట్ ఇవ్వాలని శరత్ చంద్ర డిమాండ్ చేస్తున్నాడు. తన పోరాటం ఎప్పటికీ ఆగదని.. తాను చనిపోయినా తన కొడుకు ఈ విషయంలో పోరాటం కొనసాగిస్తాడని ఆయన ఇటీవల ప్రెస్ మీట్లో స్పష్టం చేశారు. మరి మహేష్.. కొరటాల కోర్టుకు హాజరయ్యాక పరిణామాలు ఎలా ఉంటాయో.. ఈ వివాదం ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి.