జై పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్స్ లాంచ్ చేశారు. తర్వాత దాని టీజర్ విడుదల చేశారు. ఆపై లవ పాత్ర ఫస్ట్ లుక్స్.. టీజర్ వచ్చాయి. దాంతో పాటే కుశ ఫస్ట్ లుక్స్ కూడా లాంచ్ అయ్యాయి. ఇక చివరగా కుశ టీజర్ మాత్రమే రావాల్సి ఉంది. అందుకు ముహూర్తం కుదిరింది.
ఈ శుక్రవారం ఉదయం 10 గంటలకు కుశ టీజర్ రిలీజ్ చేయబోతున్నట్లు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ ప్రకటించింది. దీంతో మూడు పాత్రలకు సంబంధించిన తొలి విశేషాలు పూర్తవుతాయి. కుశ టీజర్ వచ్చిన రెండు రోజులకే జై లవకుశ ట్రైలర్ రాబోతోంది. ఇలా ఓ సినిమాలోని మూడు ప్రధాన పాత్రలకు సంబంధించి ఆరు ఫస్ట్ లుక్స్.. మూడు టీజర్లు రిలీజ్ చేయడం తెలుగులో ఇదే తొలిసారేమో. జై లవకుశ లో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నెల 10న హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగే భారీ వేడుకలో జై లవకుశ ట్రైలర్ విడుదల చేస్తారు. దీన్ని ప్రి రిలీజ్ ఈవెంట్ లాగా కూడా భావిస్తున్నారు. జై లవకుశ ఆడియో వేడుకను మొన్ననే పెద్దగా హడావుడి లేకుండా సింపుల్ గా కానిచ్చేశారు. ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని మాత్రం పెద్ద ఎత్తునే చేయనున్నారు. సెప్టెంబరు 21న జై లవకుశ ప్రేక్షకుల ముందుకు రానుంది.