మల్టీ స్టారర్ల శకం నడుస్తోంది. ప్రాజెక్టు రూపం దాల్చుతున్న మల్టీస్టారర్స్ కొన్నే అయినా.. టాక్స్ మాత్రం చాలావాటి గురించే నడుస్తోంది. వీటిలో నందమూరి బాలకృష్ణ- మహేష్ బాబు కాంబినేషన్ కూడా ఉంది.
వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతున్న మహేష్.. ఇప్పుడు ఓ మాంచి మసాలా మూవీ చేయాలని భావిస్తున్నాడు. ఇందుకు బోయపాటి శ్రీను సరైన డైరెక్టర్ అని భావించి.. పలు మార్లు డిస్కషన్స్ కూడా చేశాడు. బోయపాటి కూడా మహేష్ తో సినిమా చేసేందుకు ఉత్సాహం చూపి.. పలు స్క్రిప్ట్ లను వినిపించాడట. వీటిలో బాలకృష్ణతో కలిసి చేయాల్సిన మల్టీ స్టారర్ కూడా ఉంది. ఈ ప్రాజెక్టుపై ఎంతో మక్కువ గల బోయపాటి.. టాలీవుడ్ చరిత్రలో మిగిలిపోయే సినిమాగా తీర్చిదిద్దుతానని చెప్పాడట. మహేష్ తో కలిసి మల్టీ స్టారర్ చేసేందుకు.. ఇప్పటికే బాలయ్య ఓకే కూడా చెప్పేశారని అంటున్నారు. ఏ నిర్ణయం తీసుకోవడంలో అయినా బాలయ్య అంత చురుగ్గా ఉంటారు మరి.
కానీ బోయపాటికి సమస్యంతా మహేష్ తోనే వస్తోందట. ప్రస్తుతం భరత్ అను నేను చిత్రం చేస్తున్న మహేష్.. ఆ తర్వాత వంశీ పైడిపల్లితో సినిమా చేయాల్సి ఉంది. ఈ రెండూ పూర్తయి రిజల్ట్ తెలిస్తే కానీ.. తన డెసిషన్ తీసుకోలేనని చూచాయగా చెప్పేశాడట మహేష్.