మహేష్ బాబు సినిమా విడుదలవుతోందంటే పది రోజుల ముందుగానే హడావుడి మొదలైపోతుంటుంది. అభిమానులు బెన్ఫిట్ షోలు ఏర్పాటు చేసుకొని ఒక రోజు ముందుగానే సినిమాని చూసేస్తుంటారు. సినిమా విడుదలకి ముందు రోజు అర్ధరాత్రి నుంచి హంగామా పీక్ స్టేజీకి వెళ్లిపోతుంటుంది. రాత్రి సినిమా చూసే ఫ్యాన్స్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందా అని తెలుసుకొనేందుకు మహేష్ మేల్కొనే వుంటాడట. వేకువ జామున ఏ నాలుగింటికో ఫ్యాన్స్ నుంచి వచ్చిన రిపోర్ట్ తెలుసుకొని ఆ తర్వాత పడుకుండిపోతుంటారట.
అలాంటి మహేష్ ఈసారి మాత్రం బెన్ఫిట్ షోలు వద్దనేశాడు. ఉదయం 8 నుంచి సినిమాని చూడండని అభిమానులకి చెప్పేశాడట. బెన్ఫిట్ షోలకి బదులుగా ఉదయం షో వేసుకొనేలా పర్మిషన్ కూడా ఇప్పించేశాడు. మహేష్ ఆ నిర్ణయం తీసుకోవడానికి కారణమేంటా అని ఇప్పుడు అందరూ ఆరా తీస్తున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మహేష్ ఓ లెక్క మేరకు బెన్ఫిట్ షోలు వద్దన్నాడట. మాస్ సినిమాలకి బెన్ఫిట్ షోలు వేసినా ఓ అందం కానీ బ్రహ్మోత్సవంలాంటి కుటుంబ కథలకి అలాంటివి అవసరం లేదని వాటివల్ల సినిమాకి ఎలాంటి ఉపయోగం ఉండదనేది మహేష్ అభిప్రాయమట.
మాస్ సినిమాలైతే అభిమానులు పండగ చేసుకొనేలా వుంటాయి. అందరూ ఒక చోట కలుస్తారు కాబట్టి రచ్చ రచ్చ చేస్తుంటారు. కానీ కుటుంబ కథలు అభిమానులకి అంత మజాని ఇవ్వవనేది మహేష్ అభిప్రాయం కావొచ్చు. అందుకే అందరితోపాటే సినిమా చూసేయండని అభిమానులకి మహేష్ సలహా ఇచ్చాడట. మొత్తంగా ఇది మంచి నిర్ణయమే అని చెప్పుకోవచ్చు.