రంగస్థలం సినిమా ఫస్ట్ లుక్కే బయటికి రాలేదు.. అలాంటిది ఆడియో రిలీజవ్వడమేంటి.. దానికి మంచు మనోజ్ రివ్యూ ఇవ్వడమేంటి అంటారా..? అదే చిత్రం మరి. ఈ సినిమా ఆడియోను మనోజ్ ఆల్రెడీ వినేశాడట. ఆ పాటలు మామూలుగా లేవంటున్నాడతను.
నా సోదరుడు రామ్ చరణ్ నాకు రంగస్థలం పాటలు వినిపించాడు. అప్పట్నుంచి ఆ పాటలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. ఆడియో.. సినిమా కోసం ఆగలేకపోతున్నా. త్వరగా రిలీజ్ చేయండి అని మనోజ్ ట్వీట్ చేశాడు. ఇక అంతే.. మెగా అభిమానుల నుంచి మనోజ్ కు సందేశాలు వెల్లువెత్తాయి. పాటల గురించి వివరాలు అడుగుతూ ట్వీట్లు గుప్పించేశారు. ఓ అభిమాని రామ్ చరణ్ గురించి ఒక్క మాటలో చెప్పమని మనోజ్ ను అడిగితే.. బంగారం అని బదులిచ్చాడు మంచు వారబ్బాయి.
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగస్థలం కు అతడి ఆస్థాన సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇస్తున్న సంగతి తెలిసిందే. సుక్కు-దేవి కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన సినిమాలన్నీ మ్యూజికల్ హిట్లే. రంగస్థలం 80ల నాటి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న విభిన్నమైన సినిమా కావడంతో దీని ఆడియో కూడా ప్రత్యేకంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.