షాకుల మీద షాకులు ఇస్తున్నాడు మంచు మనోజ్. ఇప్పుడు ఆల్రెడీ ఎల్.టి.టి.ఇ గ్రూపు కథ నేపథ్యంలో ఒక్కడు మిగిలాడు అనే సినిమాతో మనోడు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత మరో సినిమా కూడా లైన్లో ఉంది. ఈ సందర్భంగా మంచు మనోజ్ ఈరోజు ఒక ట్వీటుతో అందరికీ షాకిచ్చాడు. ఒక్కడు మిగిలాడు.. ఆ తరువాత మరో సినిమా.. ఇవే నా ఆఖరి సినిమాలు. యాక్టింగ్ కు స్వస్తి పలుకుతున్నాను. థ్యాంక్యూ అంటూ ట్వీటేశాడు. సరదాగా జోక్ చేశాడా? లేదంటే నిజంగానే యాక్టింగ్ కెరియర్ వదిలేస్తున్నాడా?
ఇప్పటివరకు మంచు మనోజ్ పెద్ద స్టార్ హీరో కాలేకపోయాడు కాని.. యాక్టర్ పరంగా మాంచి మార్కులే కొట్టాడు. 2004లో దొంగా దొంగది సినిమాతో హీరో అయిన మనోజ్.. ఆ తరువాత నేను మీకు తెలుసా.. బిందాస్.. వేదం.. ప్రయాణం.. పోటుగాడు.. కరెంట్ తీగ వంటి సినిమాలతో ఆకట్టుకున్నాడు. 34 ఏళ్ల మంచు మనోజ్ కు 2015లో ప్రణతి రెడ్డితో పెళ్ళయిన సంగతి తెలిసిందే. అయితే యాక్టింగ్ కు స్వస్తి పలికేసి డైరక్షన్ పగ్గాలు చేపడతాడని.. అలాగే మంచు లక్ష్మీ ప్రసన్న ఎంటర్టయిన్మెంట్స్ బ్యానర్ పై సినిమాలు తీస్తాడని ఒక టాక్ వినిపిస్తోంది.
ఏదేమైనా కూడా మనోజ్ ఇటువంటి షాకింగ్ డెసిషన్ ను ట్విట్టర్ ద్వారా చెప్పడం ఎవ్వరికీ మింగుడుపడలేదు. యాక్టింగ్ కెరియర్ వదిలేసేంత పెద్ద వయస్సు అతని కాదు.. అలాగే ఇప్పుడు అవకాశాలూ లేకుండా పోలేదు.