ఇంకా మూడేళ్లు కూడా కాలేదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి. అప్పటికి ఇప్పటికి పార్టీ పరంగా పెద్ద మార్పులేమీ లేవు. పవన్ ఏమీ ఎన్నికల్లో పోటీ పడలేదు. ఫలితాలేమీ అందుకోలేదు. ఐతే పవన్ సోదరుడు నాగబాబు మాత్రం తమ్ముడి విషయంలో స్టాండ్ మార్చేశాడు. పవన్ జనసేన పెట్టగానే తనతో పాటు మెగా అభిమానులంతా చిరంజీవితోనే ఉంటారంటూ ప్రకటన చేశాడు. కానీ ఇప్పుడు తాను తమ్ముడి వెంట నడుస్తానంటున్నాడు. పవన్ నిజాయితీ పరుడని.. ప్రజా శ్రేయస్సు కోరతాడని.. ఫ్యామిలీ కంటే కూడా సొసైటీకే ఎక్కువ ప్రాధాన్యమిస్తాడని.. ఇంకా పవన్లోని చాలా చాలా క్వాలిటీల గురించి చెబుతూ అతణ్ని ఆకాశానికెత్తేశాడు.
తాను జనసేన కోసం పని చేయనున్నట్లు.. అందుకోసం ఏపీకి తన ఓటు కూడా మార్చుకోనున్నట్లు చెప్పాడు. 2019 ఎన్నికల్లో తన ఓటు కూడా తమ్ముడికేనని స్పష్టం చేశాడు. ఐతే ఇక్కడ అందరికీ ఆశ్చర్యం కలిగిస్తున్న విషయమేంటంటే.. చిరంజీవి ఇంకా రాజకీయాల నుంచి నిష్క్రమించలేదు మొన్న కూడా తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని కూడా చెప్పాడు. అన్నయ్య రాజకీయాల్ నిష్క్రమిస్తున్నట్లు చెప్పాక నాగబాబు తమ్ముడికి మద్దతిస్తే ఆ లెక్క వేరుగా ఉండేది. కానీ చిరంజీవి ఇంకా రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుండగానే నాగబాబు తమ్ముడికి తమ్ముడి పార్టీకి మద్దతివ్వడంతో మెగా అభిమానుల్లో గందరగోళం నెలకొంది. తాము ఎవరి వైపు నిలబడే తెలియని అయోమయ పరిస్థితి తలెత్తింది. ఒక రకంగా నాగబాబు తాజా వ్యాఖ్యాలతో త్వరలోనే చిరంజీవి రాజకీయాల నుంచి నిష్క్రమించేస్తాడేమో.. 2019 ఎన్నికల్లో ఆయన పాత్ర ఏమీ ఉండదేమో అన్న బలమైన అభిప్రాయం జనాల్లోకి వెళ్లిపోయింది. మరి మున్ముందు పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.