ప్రేమకథలన్నీ కలిసి నిత్యామీనన్ ని తమ నాయికగా ఎంచుకున్నాయా అన్నట్టుగా, వరుసగా ప్రేమకథా చిత్రాలు చేస్తూ ఆమె అభిమానులను ఆకట్టుకుంటోంది. వెండితెరపై ప్రేమభావాలను ఆవిష్కరించడమనే కళలో ఆమె ఆరితేరింది. ఇటీవల వచ్చిన 'మళ్లీ మళ్లీ ఇది రానిరోజు' ... 'ఓకే బంగారం' అనే ప్రేమకథా చిత్రాలు కూడా ఇదే విషయాన్ని నిరూపించాయి. దాంతో ఆమె ఇతర భాషల్లో నటించిన ప్రేమకథా చిత్రాలు కూడా అనువాదాలుగా తెలుగు ప్రేక్షకుల ముందుకి వస్తున్నాయి. అలా మలయాళంలో విజయాన్ని అందుకున్న ఒక సినిమాను 'ఈ వేళలో' పేరుతో ఈ నెల 3వ వారంలో విడుదల చేస్తున్నారు.
మలయాళంలో టి.కె.రాజీవ్ కుమార్ దర్శకుడిగా వ్యవహరించిన ఈ సినిమాని అశోక్ వల్లభనేని తెలుగు ప్రేక్షకుల ముందుకి తీసుకు వస్తున్నాడు. నిత్యామీనన్ .. ఉన్ని ముకుందన్ నాయికా నాయకులుగా నటిస్తోన్న ఈ సినిమా యూత్ ని ఎంతగానో ఆకట్టుకుంటుందనీ, చక్కని ప్రేమకథా కావ్యమని అనిపించుకుంటుందనే ఆశాభావాన్ని నిర్మాత వ్యక్తం చేస్తున్నాడు. నిత్యామీనన్ ఉంటే చాలు అనుకునే యూత్ ని ఈ సినిమా ఎంతవరకూ అలరిస్తుందనేది చూడాలి.