మన 36 ఏళ్ల స్నేహానికి మకుటం కబాలి అని సూపర్స్టార్ రజనీకాంత్ అన్నారని ఎల్లలు దాటిన ఆనందంతో అన్నారు ఆ చిత్ర నిర్మాత కలైపులి ఎస్.థాను.రజనీకాంత్ కథానాయకడిగా రంజిత్ దర్శకత్వంలో ఈయన తన వి.క్రియేషన్స్ పతాకంపై నిర్మించిన చిత్రం కబాలి. గత వారం ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి వచ్చిన ఈ చిత్రం వసూళ్ల పరంగా ఇరగదీస్తుండడంతో చిత్ర యూనిట్ సంబరాలు చేసుకుంటోంది. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం స్థానిక గిండి సమీపంలోని ఒక నక్షత్ర హోటల్లో సక్సెస్ మీట్లో చిత్ర నిర్మాత మాట్లాడుతూ ఈ రోజు ఉదయమే రజనీకాంత్ను కలిశానని తెలిపారు.
గత జ్ఞాపకాలను ఇద్దరం వల్లివేసుకున్నామన్నారు. రజనీకాంత్ నటించిన భైరవి చిత్రాన్ని తాను కొనుగోలు చేసింది, తాను నిర్మించిన యార్ చిత్రంలో రజనీకాంత్ తనతో పాటు ఒక్క సన్నివేశంలో నటించిన సంఘటన వంటి పలు విషయాలను చర్చించుకున్నట్లు తెలిపారు.యార్ చిత్ర వంద రోజుల వేడుకలో పాల్గొన్న రజనీకాంత్ పేద స్నేహితుడు, దనవంతుడైన స్నేహితుడి కథ చెప్పి తన పేద స్నేహితుడు థానుకు తాను ఒక చిత్రం చేయనున్నట్లు వెల్లడించారన్నారు. అలా కొంతకాలం గడిచిపోయిందన్నారు.
తరువాత తెరుపాడగన్ చిత్ర ఆడియో ఆవిష్కరణ వేదికపై తాను థానుకు అభిమానిని, ఆయన తన అభిమాని అని పేర్కొన్నారన్నారు.థాను తనకు ఏ ముహూర్తాన సూపర్స్టార్ పట్టం కట్టారోగానీ ఇప్పటి వరకూ తాను సూపర్స్టార్గానే మీ ముందు ఉన్నానని పేర్కొన్నారన్నారు. కొన్నేళ్లు గడిచిన తరువాత రజనీకాంత్ అనూహ్యంగా అనారోగ్యానికి గురై స్థానిక రామచంద్రా ఆస్పత్రిలో చేరారన్నారు.అప్పుడు తాను ఆయనతో చిత్రం చేయాలన్న ఒక్క కారణంగానే రజనీకాంత్ ఆరోగ్యంగా తిరిగి రావాలని వ్రతం చేశానన్నారు. అది ఫలించిందని రజనీకాంత్ పూర్తి ఆరోగ్యవంతుడిగా తిరిగొచ్చారని అన్నారు.
అనూహ్యంగా ఒక రోజు రజనీకాంత్ తనకు ఫోన్ చేసి మనం కలిసి చిత్రం చేద్దాం అన్నారని చెప్పారు.అప్పుడు తన ఆనందానికి అవధులు లేకుండా పోయాయన్నారు.ఇద్దరు ముగ్గురు దర్శకులతో చర్చించానని,అలాంటి సమయంతో రజనీకాంత్ కూతురు ఐశ్వర్య మడ్రాస్, అట్టకత్తి చిత్రాల ఫేమ్ రంజిత్ గురించి చెప్పారన్నారు.తాను సరేనన్నాననితెలిపారు.ఆ తరువాత రజనీకాంత్ ఫోన్ చేసి దర్శకుడు రంజిత్ చెప్పిన కథ బాగుంది. మీరొక సారి వినండి అని అన్నారన్నారు. రంజిత్ తన వద్దకు రాగా తాను కథ వినకుండానే పూర్తి స్క్రిప్ట్ రెడీ చేసుకుని రమ్మన్నానన్నారు.
అలా తాను,రజనీకాంత్ కలిసి కబాలి కథ విన్నామని అన్నారు.ఈ చిత్రం కోసం రజనీకాంత్ 24 గంటలు శ్రమించారని తెలిపారు.అలా తయారైన చిత్రాన్ని చూసిన రజనీకాంత్ మన 36 ఏళ్ల స్నేహానికి మకుటం ఈ కబాలి అని తనతోఅన్నారన్నారు.అందరూ బాషా అంటున్నారు గానీ ఇది దళపతి,నాయగన్ కలిసిన చిత్రం అని రజనీ పేర్కొన్నారన్నారు.తనకు ఇష్టమైన దర్శకుడు ఎస్పీ.ముత్తురామన్ అని అలాంటిది దర్శకుడు రంజిత్ను తనకు మరో చిత్రం చేయాలని అడిగానని అన్నారు.ఇక చిత్ర వసూళ్ల విషయానికి వస్తే బ్రహ్మాండం అన్నారు. కార్యక్రమంలో రజనీకాంత్ పాల్గొనకపోవడం గమనార్హం.