ఒక్క సర్దార్ గబ్బర్ సింగ్ కు మాత్రమే మీడియా వాళ్లకు వన్ టు వన్ ఇంటర్వ్యూలిచ్చాడు తప్ప.. మరే సినిమా గురించి మీడియాను కలిసింది లేదు. దీంతో సినిమా రిజల్ట్ గురించి ఆయన స్పందన తెలుసుకునే అవకాశం కూడా జనాలకు ఉండేది కాదు. ఐతే కాటమరాయుడు రిలీజ్ తర్వాత పవన్ అనుకోకుండా ఓ రాజకీయ ఆందోళనలో భాగంగా మీడియాను కలవడంతో ఈ సినిమా ఫలితంపై ప్రశ్నించే అవకాశం దొరికింది. అగ్రి గోల్డ్ బాధితుల కోసం విజయవాడ వచ్చిన పవన్ కు కాటమరాయుడు ఫలితం గురించిన ప్రశ్నలు ఎదురయ్యాయి.
ఐతే కాటమరాయుడు రిజల్ట్ గురించి పవన్ అందరూ అనుకున్నట్లుగా స్పందించలేదు. సినిమాల గురించి స్పందించడానికి ఇది సరైన వేదిక కాదన్న పవన్.. ప్రజా సమస్యలతో పోలిస్తే సినిమాల గురించి తనకు పెద్దగా పట్టింపు లేదని అన్నాడు. నా సినిమా బాగుంటే చూడండి.. లేదంటే లేదు. అంతకుమించి నాకు పట్టింపేమీ లేదు. నాకు సినిమాలంటే గౌరవముంది. ప్రజా సమస్యల్ని హైలైట్ చేయడానికి.. జనాల్ని ఎంటర్టైన్ చేయడానికి సినిమాలు మంచి వేదికగా నిలుస్తాయి. ప్రస్తుతానికి నాకు సినిమాల కంటే ప్రజా సమస్యలే ముఖ్యం అని తేల్చి చెప్పాడు జనసేన అధినేత. ఓవైపు కాటమరాయుడు కి భారీ నష్టాలు తప్పవని బయ్యర్లు తీవ్రంగా ఆందోళన చెందుతుంటే.. పవన్ ఇలా నచ్చితే చూడండి లేదంటే లేదని.. ఐ డోంట్ కేర్ అని అంటుండటం ఆశ్చర్యం కలిగించే విషయమే.