పూరి జగన్నాథ్ బ్యాంకాక్ వెళ్తున్నాడంటే ఎవరికీ ఏ ఆశ్చర్యం కలగదు. ఆయన బ్యాంకాక్ వెళ్లకపోతేనే ఆశ్చర్యపోవాలి. కానీ పవన్ కళ్యాణ్ సింగపూర్ వెళ్తున్నాడంటే మాత్రం అందరికీ షాకింగ్ గా ఉంది. ఆంధ్రప్రదేశ్ ను సింగపూర్ లాగా చేస్తానంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఆ దేశ అధికారులతో మంతనాలు జరుపుతూ మాస్టర్ ప్లాన్స్ రెడీ చేస్తున్న తరుణంలో పవన్ సింగపూర్ పర్యటన చేయబోతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. నిర్విరామంగా సాగుతున్న ?సర్దార్ గబ్బర్ సింగ్? షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకుని మరీ పవన్ సింగపూర్ వెళ్తున్నాడట. ముందు అనుకున్న ప్లాన్ ప్రకారం.. పవన్ ఈ షెడ్యూల్ పూర్తయ్యేవరకు ఎక్కడికీ కదలకూడదు. దాదాపుగా సినిమాను పూర్తి చేసేయాలి.
కానీ పవన్ మాత్రం బ్రేక్ ద రూల్స్ అంటూ.. బ్రేక్ తీసుకుని సింగపూర్ చెక్కేస్తున్నాడు. ఊరికే విహారానికి వెళ్తున్నాడా.. లేక రాజకీయ కారణాలతో ఆ దేశంలో పర్యటిస్తున్నాడా అన్నది సన్నిహితులే చెప్పాలి. అసలే ?సర్దార్ గబ్బర్ సింగ్? షూటింగ్ అనుకున్న ప్రకారం జరగట్లేదని యూనిట్ సభ్యులతో పాటు అభిమానులు కూడా ఆందోళన చెందుతున్న సమయంలో పవన్ ఇలా చేయడమేంటో అర్థం కావడం లేదు. ముందు సంక్రాంతికి అనుకున్న సినిమా.. ఏప్రిల్ కు వాయిదా పడింది. తర్వాత ఇప్పుడు మే అంటున్నారు. మరి ఆ నెలలోనైనా సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుందో లేదో అన్నది డౌటుగా ఉంది. అసలు ?సర్దార్? షూటింగ్ ఏ దశలో ఉందన్నది కూడా జనాలకు క్లారిటీ లేదు.