అజ్ఞాతవాసి ఆడియో వేడుకలో చాలా సుదీర్ఘ ప్రసంగమే చేశాడు పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా మధ్యలో ఒక చోట తాను ఎవరి కష్టాన్నయినా చూస్తే ఎలా తట్టుకోలేనో వివరించాడు పవన్. సమాజంలో అందరి కష్టాలూ చూసి తాను ఆవేదన చెందేవాడినని పవన్ చెప్పుకొచ్చాడు. అలాగే తన సినిమాల వల్ల ఎవరైనా నష్టపోతే డబ్బులిచ్చేసేవాడినని.. తన వల్ల ఎవరూ నష్టపోకూడదన్నది తన ఉద్దేశమని.. డబ్బుల గురించి తాను ఆలోచించేవాడిని కాదని పవన్ అన్నాడు. ఐతే గతంలో జానీ సినిమాకు పవన్ బయ్యర్లకు డబ్బులు వెనక్కి ఇప్పించిన మాట వాస్తవం. అలాగే తన అన్నయ్య నాగబాబు నిర్మించిన ఆరెంజ్ సినిమా భారీ నష్టాలు తెచ్చిపెడితే.. అవి సెటిల్ చేయించి.. తాను స్వయంగా నాగబాబును ఆదుకోవడం కూడా నిజమే.
ఐతే పవన్ ఇంతకుముందులాగా ఇప్పుడు లేడన్నది ఇండస్ట్రీ వర్గాల అభిప్రాయం. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకు బయ్యర్లు దారుణంగా నష్టపోతే పవన్ వాళ్లను ఆదుకోలేదు. కొందరు బయ్యర్లు ఈ విషయమై ప్రెస్ మీట్ పెట్టి పవన్ మీద మండిపడ్డారు. ఒక బయ్యర్ అయితే నిరాహార దీక్షకు కూడా దిగాడు. అయినా పవన్ నుంచి ఎలాంటి స్పందన లేదు. దీని తర్వాత కాటమరాయుడు కు కూడా బయ్యర్లు దారుణంగా నష్టపోయారు. కానీ వాళ్లకు కూడా ఎలాంటి సాయం అందలేదు. నష్టాలు పూడ్చే ప్రయత్నం చేయలేదు. ఈ రెండు సినిమాలూ పవన్ మిత్రుడు శరత్ మరార్ నిర్మించినవే. వీటిలో పవన్ కు నిర్మాణ భాగస్వామ్యం ఉందని.. ఆయనకు ఈ సినిమాల ద్వారా భారీ స్థాయిలో ఆదాయం సమకూరిందని ఊహాగానాలు వినిపించాయి. అందులో వాస్తవమెంతో కానీ.. ఈ రెండు సినిమాలకూ బయ్యర్లు దారుణంగా నష్టపోయిన మాట వాస్తవం. పవన్ వాళ్లకు ఆదుకోని మాటా వాస్తవం. ఐతే ఈ విషయాల్ని అందరూ మరిచిపోయిన సమయంలో పవన్.. తన సినిమాలతో ఎవరైనా నష్టపోతే తట్టుకోలేనంటూ అజ్ఞాతవాసి ఆడియో వేడుకలో వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది.