సినిమాలకు త్వరలో గుడ్ బై చెప్పేసి రాజకీయాల్లో దృష్టిపెట్టాలన్న ఉద్దేశంతో ఉన్నట్లుండి స్పీడు పెంచేశాడు పవన్ కళ్యాణ్. కెరీర్లో ఎన్నడూ లేని విధంగా కొన్ని నెలల వ్యవధిలో మూడు సినిమాలకు ప్రారంభోత్సవం జరిపించేశాడు. అందులో ఒకటైన ?కాటమరాయుడు? శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. మరోవైపు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయబోయే సినిమా వచ్చే నెలలోనే సెట్స్ మీదికి వెళ్లిపోతోంది.
టీఎన్ నీశన్ దర్శకత్వంలో చేసే సినిమాను కూడా సాధ్యమైనంత త్వరగా మొదలుపెట్టాలని చూస్తున్నాడు పవన్. మొత్తానికి వచ్చే ఏడాది పవన్ సినిమాలు మూడు రిలీజయ్యేలా కనిపిస్తోంది పరిస్థితి. ఈ మూడు పూర్తయ్యాక పవన్ దాదాపుగా సినిమాలు మానేసినట్లే అంటున్నారు ఆయన సన్నిహితులు. ఎందుకంటే ఇవి పూర్తి చేసి రిలీజయ్యేసరికి వచ్చే ఏడాది గడిచిపోతుంది. 2019లో ఎన్నికలు కాబట్టి ముందు ఏడాదే పూర్తిగా రాజకీయాలపై దృష్టిపెట్టాలి. కాబట్టి పవన్ ఈ మూడు సినిమాలు పూర్తి చేయడమే గొప్ప.
ఐతే పవన్ చివరి సినిమాగా ప్రేక్షకుల ముందుకొచ్చేది ఏది అన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతున్న విషయం. పవన్ ఫ్యాన్స్ సహా అందరూ.. అది త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోయేదైతేనే బాగుంటుందని కోరుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ల కాంబినేషన్ కు ఉన్న క్రేజ్ అలాంటిది. టీఎన్ నీశన్ దర్శకత్వంలో చేయబోయేది ?వేదాళం? రీమేక్ అన్న ప్రచారం జరుగుతోంది. రీమేక్ అంటేనే జనాలకు ఏమంత ఆసక్తి లేదు. పైగా తమిళ దర్శకుడితో కావడంతో దీనిపై పెద్దగా అంచనాల్లేవు.
జనాల కళ్లన్నీ త్రివిక్రమ్ తో పవన్ చేసే సినిమా మీదే ఉన్నాయి. పైగా ఆ సినిమాను సామాజికాంశాల నేపథ్యంలో తీస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. అలాంటపుడు దాన్ని చివరగా రిలీజ్ చేస్తే అది పవన్ రాజకీయ అరంగేట్రానికి లాంచింగ్ ప్యాడ్ లాగా ఉంటుందని కూడా భావిస్తున్నారు. కానీ ముందు త్రివిక్రమ్ సినిమానే మొదలవుతుందని.. ఆగస్టులోనే ఈ చిత్రం రిలీజవుతుందని అంటున్నారు. దీని తర్వాత నీశన్ సినిమా వస్తుందని చెబుతున్నారు. అదే నిజమైతే అభిమానులు నిరాశ చెందుతారేమో.