సాధారణంగా పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ లంటే ఓ పట్టాన పూర్తి కావు. అయితే ఉరుకులు పరుగుల మీద షూటింగ్ పనులు పూర్తి చేయడం.. లేదంటే రోజుల తరబడి షెడ్యూళ్లు పెండింగ్ లో ఉండిపోవడం షరామామూలే. కాటమరాయుడు తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వస్తున్న చిత్రం మాత్రం ఇందుకు కాస్త మినహాయింపు లభించింది. ఈ సినిమా షూటింగ్ కు పవన్ రెగ్యులర్ గానే అటెండ్ అవుతున్నాడు. ఈ సినిమా ప్లాన్ చేసిన తర్వాత ఒక్క రోజు షూటింగ్ కూడా క్యాన్సిల్ కాకపోవడం విశేషం. ఈ వీకెండ్ నుంచి హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది.
ఇంతవరకు బాగానే ఉన్నా పవన్ తర్వాత సినిమాల పరిస్థితి ఏంటనే దానిపైనే ఓ పట్టాన క్లారిటీ రావట్లేదు. ఎందుకంటే పవన్ సినిమాలతో పాటు తన సొంత రాజకీయ పార్టీ జనసేనను బలోపేతం చేయడంపైనా దృష్టి పెట్టాల్సి ఉంది. రాష్ర్టం లో మారుతున్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా గ్రామ స్థాయి నుంచి పార్టీ కేడర్ ను చూసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు ముందస్తు ఎన్నికల వార్తలూ వినిపిస్తున్నాయి. 2018లోనే ఎన్నికలు రావచ్చన్న టాక్ వినిపిస్తోంది. ఇదేగానీ నిజమైతే పవన్ చేతుల్లో ఉన్న సమయం చాలా తక్కువ. అందుకే అతడు త్వరపడాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో త్రివిక్రమ్ తీస్తున్న సినిమా తర్వాత దేనికి కమిట్ మెంట్ ఇస్తాడు అన్నదానిపై అంతటా ఆసక్తి ఉంది.
ఇటీవల బాలీవుడ్ లో హిట్టయిన జాలీ ఎల్.ఎల్.బి.-2 రీమేక్ పై పవన్ ఆసక్తి చూపుతున్నాడనే సమాచారం బయటకొచ్చింది. దీనికి కందిరీగ ఫేం దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్ చేస్తాడనేది ఫిలింనగర్ సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ దీనికి ప్రొడ్యూసర్స్ గా వ్యవహరించే అవకాశముంది.