ఈసారి ఎన్నికల బరిలోకి దిగబోతున్న నేపథ్యంలో వచ్చే ఏడాది మధ్య నుంచే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి దిగాల్సి ఉంటుంది. కొన్ని నెలల కిందటే పూర్తి కావాల్సిన అజ్నాతవాసి అనుకున్నదాని కంటే ఆలస్యమైంది. కాబట్టి పవన్ ఇంకో సినిమాలో నటించడం సందేహమే అని.. ఇదే ఇప్పటికి పవన్ చివరి సినిమా అవుతుందని అనుకున్నారంతా. కానీ పవన్ ఆలోచనలు వేరేలా ఉన్నాయి. ఆయన ఇంకా ఒకటికి రెండు సినిమాలు పూర్తి చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఆల్రెడీ ఉన్న కమిట్మెంట్లను పూర్తి చేయకుండా సినిమాలకు టాటా చెప్పడం కరెక్ట్ కాదని పవన్ భావిస్తున్నట్లు సమాచారం.
వచ్చే ఏడాది జనవరి నుంచి ఎనిమిది నెలల వ్యవధిలో రెండు సినిమాలు పూర్తి చేసి.. ఆ తర్వాత పూర్తి స్థాయి రాజకీయాల్లోకి దిగాలని పవన్ డిసైడైనట్లు సమాచారం. పవన్ చేయబోయే రెండు సినిమాలూ రీమేకులేనట. అందుకే వీటిని వేగంగా పూర్తి చేయడానికి ప్లాన్ చేస్తన్నాడు. ఎ.ఎం.రత్నం నిర్మాణంలో టి.ఎన్.నీశన్ దర్శకుడిగా వేదాలం రీమేక్ ను జనవరిలో మొదలుపెట్టి.. మూణ్నాలుగు నెలల్లో ఈ సినిమాను పూర్తి చేస్తాడట. అలాగే మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్లో సంతోష్ శ్రీనివాస్ తెరకెక్కించే తెరి రీమేక్లోనూ పవన్ నటిస్తాడట. ఈ చిత్రం మార్చిలో మొదలవుతుందని.. దాన్ని కూడా నాలుగైదు నెలల్లో పూర్తి చేయాలని పవన్ ఫిక్సయ్యాడని అంటున్నారు.