దర్శకుడు పూరీ జగన్నాథ్ మంచి ఊపు మీదున్నాడు. తక్కువ పనిదినాల్లో ... అనుకున్న సమయానికి ప్రాజక్టును పూర్తి చేస్తాడన్న పేరు తెచ్చుకున్న ఈ దర్శకుడు, ప్రస్తుతం ఓ భారీ ప్రతిష్ఠాత్మక చిత్రం బాధ్యతను తలకెత్తుకున్న సంగతి విదితమే. చిరంజీవి నటించే 150 వ చిత్రం 'ఆటోజానీ'కి ఆయన దర్శకత్వం వహిస్తూ వార్తల్లో నిలిచాడు. ఇదిలా ఉంచితే, ఈ సినిమా తర్వాత మహేష్ బాబుతో ఓ భారీ చిత్రానికి మరోపక్క ప్లాన్ చేసుకుంటున్నాడు. అందుకు సంబంధించిన స్క్రిప్టు కూడా రెడీ అయిందట.
ఈ విషయాన్ని పూరీ చెబుతూ, "మా కాంబినేషన్లో వచ్చే మూడో సినిమాకి స్క్రిప్టు వర్క్ ఇప్పుడే పూర్తయిందని మహేష్ ఫ్యాన్స్ కి చెబుతున్నందుకు హ్యాపీగా వుంది. హ్యాట్రిక్ కొట్టడానికి రెడీ అవుతున్నాం... చీర్స్" అంటూ ట్వీట్ చేశాడు. ఒకేసారి ఇలా రెండు భారీ ప్రాజక్టులతో ఇటు చిరంజీవి ఫ్యాన్స్ ను, అటు మహేష్ ఫ్యాన్స్ ను ఆనందంలో ముంచెత్తుతున్నాడు!