దర్శకుడు పూరీ జగన్నాధ్ ఏ విషయంపైనా నెలలు నెలలు ఆలోచిస్తూ కూర్చోడు. వరుస ఫెయిల్యూర్స్ తర్వాత కళ్యాణ్ రామ్ తో ఇజం స్టార్ట్ చేయడం.. చకచకా షూట్ చేయడం రిలీజ్ చేసేయడం కూడా పూర్తయిపోయాయి. దర్శకుడిగా పూరీకి ఈ సినిమా ఓకే. హీరో కళ్యాణ్ రామ్ కు కూడా సంతృప్తినే ఇచ్చింది. ఓవరాల్ గా మాత్రం ఫెయిల్యూర్ గా నిలిచింది. వెంటనే ఎన్టీఆర్ తో సినిమా చేసేద్దామని అనుకున్న పూరీ స్పీడ్ కి ఇజం అడ్డుపడ్డ సంగతైతే వాస్తవమే.
ఇప్పుడు పూరీ ఏం చేస్తున్నాడు.. దీనిపై పెద్దగా బుర్ర బద్దలు కొట్టేసుకోవాల్సిన పనేమీ లేదు. బ్యాంకాక్ లో స్క్రిప్ట్ రాసుకుంటున్నాడు. కానీ అసలు విషయం ఏంటంటే.. ఈ స్క్రిప్ట్ ఎవరికోసం అన్నదే పాయింట్? పూరీ ఇప్పుడు ఓ స్మాల్ బడ్జెట్ ఫిలిం తీసేందుకు రెడీ అవుతున్నాడట. దాదాపు కొత్తవాళ్లతోనే ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది. పూరీ నుంచి ఫుల్ లెంగ్త్ లవ్ స్టోరీ వచ్చి ఏళ్లు గడిచిపోవడంతో.. ఆ జోనర్ లో మూవీ ప్లాన్ చేస్తున్నాడని.. ఆ స్క్రిప్ట్ కే తుది మెరుగులు దిద్దేందుకు బ్యాంకాక్ వెళ్లాడని సన్నిహితులు చెబుతున్నారు.
అటు మహేష్ నుంచి కానీ.. ఇటు ఎన్టీఆర్ నుంచి కానీ పూరీ జగన్నాథ్ కి గ్రీన్ సిగ్నల్ దొరకలేదు. అందుకే ఈ లోగా ఓ లోబడ్జెట్ మూవీతో తన స్టామినా చాటాలని చూస్తున్నాడట పూరీ.