వెండితెరపై పారిజాతాల రాశి పోసినట్టుగా కనిపించే కథానాయిక రాశీఖన్నా. తీర్చిదిద్దినట్లుండే ఆకృతి .. చక్కని మేనిఛాయ .. ఆకర్షణీయమైన కళ్లు కుర్రకారు ప్రేక్షకులకు కుదురు లేకుండా చేస్తుంటాయి. 'జిల్' సినిమా తరువాత ఈ సుందరి తన స్పీడును పెంచే పనిలో పడింది. ఆ ప్రయత్నంలో భాగంగానే 'బెంగాల్ టైగర్', 'శివం' చిత్రాల్లో ఛాన్సులు కొట్టేసింది. వీటి తరువాత కూడా అమ్మడిని వెతుక్కుంటూ అవకాశాలు బాగానే వెళుతున్నాయని అంటున్నారు. ఇక వచ్చిన అవకాశాన్ని వచ్చినట్టుగానే ఒప్పేసుకుంటున్నట్టు రాశీయే స్వయంగా చెప్పేస్తోంది.
మరీ అంత ఆశ ఎందుకని అనుకుంటారేమోనని, అన్నిరకాల పాత్రలను చేస్తూ వెళుతుంటేనే గదా ఎలాంటి పాత్రలు బాగా చేయగలమనే విషయంలో ఒక స్పష్టత వస్తుందని కొత్త విషయం చెబుతోంది. తానేంటో తనకి తెలియడం కోసమే కొంతకాలం పాటు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్ణయించుకున్నాననీ, అందుకే తనకి వచ్చే పాత్రలు ఇలా వుండాలి .. అలా వుండాలి అనే నియమాలేమీ పెట్టుకోలేదని అంటోంది. దాంతో .. ఇంతటి ఆలోచన ఇంతవరకూ మిగతా కథానాయికలకి రాకపోవడం విచారించదగిన విషయమనే కామెంట్లు మొదలయ్యాయి.