ఎస్.ఎస్.రాజమౌళికి అవార్డులు.. గౌరవాలు కొత్తేం కాదు. ఇప్పటికే పద్మశ్రీ పురస్కారం కూడా ఆయన అందుకున్నారు. బాహుబలితో ఎందరో మహామహుల ప్రశంసలూ అందుకున్నారు. అంత గొప్ప డైరెక్టర్ కూడా అక్కినేని అవార్డు అందుకోవడానికి నేను అర్హుడిని కాను అనేశాడు.
ఈ అవార్డు అందుకున్న సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ సాధారణంగా అవార్డు అందుకోవడం అంటే కొత్త శక్తినిస్తుంది. ఎగరడానికి కొత్త రెక్కలు దొరికినట్టు అనిపిస్తుంది. కానీ అక్కినేని అవార్డు నా భుజాలపై బాధ్యత మరింత పెంచిందనే అనుకుంటాను. ఇంకా కష్టపడాలి. ఇంకా మరింత శ్రమించాలి అని గుర్తు చేయడానికే ఈ అవార్డు ఇచ్చారని భావిస్తున్న అంటూ అక్కినేని పట్ల తనకున్న గౌరవ భావాన్ని చాటుకున్నాడు.
నేను రమ్మన్నప్పుడే నా దగ్గరకు రమ్మని మరణాన్ని శాసించగలిగినది నాకు తెలిసింది ఇద్దరే. మహాభారతంతో భీష్మాచార్యుడు. కలియుగంలో అక్కినేని నాగేశ్వరరావు అని ఏఎన్ ఆర్ గొప్పతనాన్ని చెబుతూ రాజమౌళి చెప్పిన మాటలతో సభ చప్పట్లతో మారుమోగింది. ఇదే వేదికపై నాగేశ్వరరావుకు ఉన్న మనోబలం ఎంతటిదో మరోసారి అందరికీ గుర్తు చేశాడు రాజమౌళి.
1974లో మొదటిసారి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఏఎన్ ఆర్ కు ఆపరేషన్ చేసిన డాక్టర్లు ఆయనకు 14 సంవత్సరాలు ఆరోగ్యం ఢోకా లేదని భరోసా ఇచ్చారు. ఆ సమయం అయిపోయాక డాక్టర్లు గుండె బలహీనంగా ఉందని రెండో సర్జరీ చేయలేదు. కానీ నాగేశ్వరరావు తన మనోబలంతో మరో 14 ఏళ్లు బతకాలని నిశ్చయించుకుని అలాగే బతికారు. తర్వాత మరో తొమ్మిదేళ్లు తన ఆయుర్దాయం ఉండాలని కోరుకున్నారు. ఆ తర్వాత ఆయన మరణాన్ని స్వచ్ఛందంగానే ఆహ్వానించారు. ఆయన ఈ రోజు భౌతికంగా లేకపోయినా ఆయన సంతతిరూపంలో మనమధ్యనే ఉన్నారు