ఒకప్పుడు తమ సినిమా ఏడాదికి ఒకటి వస్తే చాలనే ఆలోచనలో కథానాయకులు వుండేవారు. అయితే ఆ సినిమా కాస్తా ఫ్లాప్ అయితే మరో సక్సెస్ పలకరించడానికి ఎక్కువ సమయం పట్టేది. అందుకే స్టార్ హీరోల ఆలోచనలో మార్పు కనిపిస్తోంది. సాధ్యమైనన్ని ఎక్కువ సినిమాలు చేయడానికి వాళ్లు ప్లాన్ చేసుకుంటున్నారు. అలాంటివారి జాబితాలో సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా కనిపిస్తున్నాడు. తాజాగా ఆయన రంజిత్ అనే యువ దర్శకుడి సినిమాను 45 రోజులలో పూర్తిచేయనున్నాడు.
ఈ నేపథ్యంలోనే ఆయన చూపు మరో సినిమాపై పడిందని అంటున్నారు. ఆ సినిమాయే 'భాస్కర్ ది రాస్కెల్'. సిద్ధిక్ దర్శకత్వంలో మలయాళ తెరకెక్కిన ఈ సినిమా అనూహ్యమైన విజయాన్ని సాధించింది. మమ్ముట్టి .. నయనతార నాయకా నాయికలుగా నటించిన ఈ సినిమాని ఇటీవల రజనీ చూశాడట. కథా కథనాలు .. పాత్రలను తీర్చిదిద్దిన తీరు రజనీకి ఎంతగానో నచ్చాయట. దాంతో ఈ సినిమా తమిళ్ రీమేక్ లో తాను నటిస్తే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చాడని చెబుతున్నారు. కొత్తదనాన్ని తన అభిమానులు ఎప్పుడూ ఆదరిస్తుంటారనే ధీమాని వ్యక్తం చేశాడని కూడా అంటున్నారు.