నిర్మాతగా తన తొలి ప్రయత్నంలోనే తిరుగులేని విజయం సాధించాడు రామ్ చరణ్. ఖైదీ నంబర్ 150 ఇచ్చిన జోష్ మెగా పవర్ స్టార్ లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇకపై యాక్టర్ గానే కాకుండా ప్రొడ్యూసర్ గా కూడా తెగ యాక్టివ్ అయిపోవాలని ఇప్పటికే డిసైడ్ అయిన చెర్రీ.. ఇప్పుడు కొత్త ఆలోచన చేస్తున్నాడట. హైద్రాబాద్ లో ఓ ఫిలిం స్టూడియో కట్టేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడట రామ్ చరణ్.
ప్రస్తుతం హైద్రాబాద్ లో చెప్పుకోదగ్గ సంఖ్యలోనే సినిమా స్టూడియోలు ఉన్నాయి. అందుకే భారీ స్థాయిలో కాకుండా.. ఓ మినీ స్టూడియో నిర్మాణం చేపట్టేందుకు సిద్ధమవుతున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే హైద్రాబాద్ పరిసరాల్లోని కొన్ని ప్రదేశాలను.. స్టూడియో కోసం పరిశీలించాడట కూడా. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే ఫిలిం స్టూడియో ఏర్పాటు మొదలైపోవచ్చని టాలీవుడ్ జనాలు అనుకుంటున్నారు. త్వరలో అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చే అవకాశాలున్నాయని టాక్.
ఇటు హీరోగానే కాకుండా బిజినెస్ మ్యాన్ గాను చెర్రీ సత్తా చాటాలని భావిస్తున్నాడు. మహేష్ బాబు.. రామ్ చరణ్ ఇద్దరూ కలిసి హోటల్ బిజినెస్ స్టార్ట్ చేస్తారనే రూమర్ కూడా బాగానే వినిపిస్తోంది. ప్రస్తుతం చెర్రీకి హైద్రాబాద్ లో ఓ పోలో టీం ఉన్న సంగతి తెలిసిందే కదా.