రామ్ గోపాల్ వర్మకు మాఫియా మీద.. క్రైమ్ స్టోరీల మీద సినిమాలు తీయడం చాలా ఇష్టం. ఆ తరహా సినిమాలు తీయడంలో ఆయన నైపుణ్యం కూడా ప్రత్యేకమైంది. వాస్తవ సంఘటనల నేపథ్యంలో ఆయన తీసిన సినిమాలు చాలా వరకు విజయవంతమయ్యాయి. పోలీసులు.. క్రిమినల్స్ నుంచి చాలా బాగా సమాచారం రాబట్టి.. తెరమీద ఆ విషయాల్ని ఆసక్తికరంగా చూపిస్తాడు వర్మ. ఇలా ఆసక్తికర విషయాలు రాబట్టడంలో వర్మ ప్రత్యేకతను గమనించవచ్చు. మీడియాకు.. పోలీసులకు తెలియని విషయాల్ని కూడా వర్మ వెలికి తీస్తుంటాడు. వాటిని తెరమీద చూపిస్తుంటాడు. మరి వర్మ మాత్రమే ఈ విషయాల్ని ఎలా రాబట్టగలుగుతాడు.. వాళ్లు వర్మకే ఇలాంటి విషయాలు ఎలా చెబుతారు.. ఇదే ప్రశ్నల్ని వర్మ ముందుంచితే ఆయన తన టెక్నిక్ ఏంటో చెప్పారు.
ఒక హత్య కేసుకు సంబంధించి తీహార్లో జైలు శిక్ష పూర్తి చేసుకుని బయటికి వచ్చిన ఒక క్రిమినల్ ను కలిసినపుడు.. అతను హత్య చేసిన రాత్రి ఎన్ని గంటలకు పడుకున్నాడో అడిగాను. ఆ ప్రశ్నకు అతను ఆశ్చర్యపోయాడు. ఆ ప్రశ్న అతడిని ఎమోషనల్ గా టచ్ చేసింది. తాను అంత వరకు ఆ విషయం గురించి ఆలోచించలేదని.. ఎవరితోనూ పంచుకోలేదని చెబుతూ.. ఆ రాత్ర తన మానసిక స్థితి ఏంటో నాకు చెప్పాడు. మరో సందర్భంలో సదానంద్ అనే పోలీస్ అధికారితో మాట్లాడుతూ.. ఆయన గురించి చెప్పమంటే బాల్యం దగ్గర్నుంచి చెప్పడం మొదలుపెట్టాడు. నేను ఆయనకు అడ్డం పడి మీ జీవితంలో తొలిసారి పోలీస్ అనే పదం ఎప్పుడు విన్నారు అని అడిగాను. ఆయన ఆశ్చర్యపోతూ ఆ ప్రశ్నకు సమాధానం వెతికే పనిలో పడ్డారు. దానికి సమాధానం చెప్పాక అలాంటి ప్రశ్నలే మరిన్ని వేశాను. ఇక ముంబయి అటాక్స్ సందర్భంగా హీరోగా నిలిచిన విశ్వాస్ నాగరే పాటిల్ ను ఓ ఆసక్తికర ప్రశ్న వేశాను.
అందరూ ఆయన్ని పొగిడేస్తున్న సమయం.. మీ చేతిలో ఉన్నది చిన్న పిస్టల్. అవతల టెర్రరిస్టుల దగ్గర పెద్ద పెద్ద గన్స్ ఉన్నాయి. అయినా వాళ్ల దగ్గరకు వెళ్లడం మూర్ఖత్వం కదా’ అని అడిగాను. అందుకు బదులుగా తాను ఎలాంటి కంపల్షన్లో తాజ్ హోటల్లో టెర్రరిస్టులున్న పై అంతస్థుకు వెళ్లాల్సి వచ్చిందో వివరించారు. తనను ఇలాంటి ప్రశ్నలు ఎవరూ వేయలేదని.. తాను కూడా ఎవరికీ ఇలాంటి విషయాలు చెప్పలేదని అన్నారు. ఇలా నేను వేసే ప్రశ్నలే నాకు ఆసక్తికర సమాచారం తెచ్చిపెడతాయి.