దర్శకుడు కొరటాల శివ ఇప్పుడు టాప్ లీగ్ లో స్థానం పదిలం చేసేసుకున్నాడు. తను చేసిన మూడే మూడు సినిమాలైనా.. అన్నిటితోనూ ఆయా హీరోలకు కెరీర్ బెస్ట్ ఇవ్వగలిగాడు. మిర్చితో ప్రభాస్.. శ్రీమంతుడుతో మహేష్.. జనతా గ్యారేజ్ తో ఎన్టీఆర్ లకు బ్లాక్ బస్టర్స్ అందించాడు కొరటాల. ఇంతటి విజయాలు తన ఒక్కడి సొంతమే కాదని.. టీమ్ అంతా పడ్డ కష్టానికి ఫలితమని నిజాయితీగా చెప్పగల డైరెక్టర్ కొరటాల.
జనతా గ్యారేజ్ ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్ గా అనేక ఇంటర్వ్యూలు ఇచ్చిన ఈ దర్శకుడు.. సింప్లిసిటీతో చంపేశాడని చెప్పాలి. తనకు కెమేరా వర్క్ ఏంటో తెలీదని.. ఆ బ్లాక్స్ ఏంటో.. ఏ కెమేరాలు ఉపయోగిస్తారో తెలీదన్న కొరటాల శివ.. అందుకే కదా సినిమాటోగ్రాఫర్ ని పెట్టుకునేది అని చెప్పడం నవ్వులు పూయించింది. ఇక సంగీతం గురించి కూడా తనకు ఏమీ తెలీదని.. రాగం-తానం లాంటివేమీ తనకు పట్టదని.. కేవలం తను వినే పాట బాగుందో లేదో చెప్పగలనంతే అంటున్నాడీ దర్శకుడు.
'ఒక ప్రేక్షకుడిగా ఆ పాటలో ఫీల్ ని ఫీలయ్యి ఎలా ఉందో చెబుతానంతే. అందుకు మించి మ్యూజిక్ గురించి నేను మాట్లాడితే బఫూన్ లా ఉంటుంది' అంటూ కొరటాల చెప్పడం విశేషం. ఎవరి డిపార్ట్ మెంట్ లో వారికి స్వేచ్ఛనిస్తానని.. ఎవరిపైనా ప్రెజర్ పెట్టనని ఎంత సింపుల్ గా చెప్పేశాడో కదా. ఇలాంటి సింపుల్ అండ్ పవర్ ఫుల్ డైలాగ్స్ సినిమాల్లో కూడా పేలుతుండబట్టే ఈ రేంజ్ సక్సెస్ లు దక్కుతున్నాయ్ మరి