హీరోగా మహేష్ బాబు కెరీర్లో ఎన్నడూ లేని విధంగా మూడేళ్ల పాటు గ్యాప్ వచ్చింది ఒక టైంలో. అతిథి సినిమా విడుదలైన మూడేళ్లకు కానీ ఖలేజా విడుదలవ్వలేదు. మహేష్ లాంటి సూపర్ స్టార్ అంత గ్యాప్ తీసుకోవడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఒక ప్రాజెక్టు సెట్ కావడానికి.. అది పూర్తవడానికి అంత సమయం పట్టడమేంటో ఎవరికీ అర్థం కాలేదు. ఐతే మహేష్ కెరీర్లో అప్పుడు అంత గ్యాప్ రావడానికి కారణం లేకపోలేదు అంటోంది అతడి భార్య నమ్రత.
తమ అబ్బాయి గౌతమ్ పుట్టిన కొన్నాళ్లకే తన తల్లిదండ్రులిద్దరూ కొంచెం గ్యాప్ లో చనిపోయారని.. ఆ టైంలో మహేష్ తన పనులన్నీ పక్కన పెట్టేసి తన కోసం సమయం కేటాయించాడని.. తనతోనే గడిపాడని ఖలేజా కు ముందు గ్యాప్ రావడానికి అదే కారణమని వెల్లడించింది నమ్రత. ఆ సమయంలో మహేష్ ఇచ్చిన సపోర్ట్ ఎప్పటికీ మరవలేనని నమ్రత వ్యాఖ్యానించింది.
మహేష్ తన తల్లిదండ్రుల్ని ఎంతగానో ప్రేమిస్తాడని.. అతనో గొప్ప కొడుకని.. అలాగే పిల్లల్ని కూడా అంతే బాగా చూసుకుంటూ గొప్ప తండ్రిగానూ ఉంటున్నాడని నమ్రత చెప్పింది. జీవిత భాగస్వామి కూడా మహేష్ పర్ ఫెక్ట్ అని.. అతణ్ని కలవడం తాను చేసుకున్న అదృష్టమని అంది నమ్రత. నటుడిగా మహేష్ ఎంత బ్రిలియంటో.. వ్యక్తిగా అంత మంచి వాడని.. మంచి ఫ్యామిలీ మ్యాన్ కూడా అని.. ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఏడాదిలో రెండుసార్లు తమందరినీ హాలిడేకు తీసుకెళ్తాడని నమ్రత పేర్కొంది