ఓవైపు మహేష్ బాబు సినిమా భరత్ అను నేను.. మరోవైపు రామ్ చరణ్ మూవీ రంగస్థలం 1985.. ఇంకో వైపు బాలయ్య చిత్రం జయసింహా 2018 సంక్రాంతిలో అమీతుమీ తేల్చుకునే అవకాశాలున్నాయి. మామూలుగా అయితే ఒకే వారంలో మూడు పెద్ద సినిమాలు రావడం జరగదు. కానీ సంక్రాంతి సీజన్ మాత్రం ఇందుకు మినహాయింపు. ఈ సీజన్లో మూడు నాలుగు సినిమాలొచ్చినా అన్నింటికీ మంచి వసూళ్లే ఉంటాయని గత రెండు సంక్రాంతి సీజన్లు రుజువు చేశాయి. అందుకే ధైర్యంగా ఒకరి తర్వాత ఒకరు సంక్రాంతి రిలీజ్ అంటూ ప్రకటన చేసేశారు.
ఐతే సంక్రాంతికి రాబోయే మూడు సినిమాల మీదా అంచనాలు భారీగానే ఉంటాయి కాబట్టి.. ఏ సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చినా మిగతా వాటి నుంచి పెద్ద దెబ్బే తగులుతుంది. అన్నిసార్లూ అన్ని సినిమాలూ ఆడేస్తాయన్న గ్యారెంటీ ఏమీ లేదు. ఈ సినిమాలకు ఎలాంటి టాక్ వస్తుంది.. అవి ఎలా ఆడతాయన్నది పక్కన పెడితే.. 2018 సంక్రాంతి సినిమాలకు మరో టెన్షన్ కూడా తప్పేలా లేదు. జనవరి 25న రజినీకాంత్-శంకర్ ల మెగా కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘2.0’ విడుదల కాబోతోంది. గత రెండు సంక్రాంతి సీజన్లలో తెలుగు సినిమాలకు తర్వాతి రెండు వారాలు కూడా పెద్దగా పోటీ అనేది లేదు. లాంగ్ రన్ కారణంగా వసూళ్లు పెరిగాయి. కానీ ఈసారి రెండు వారాలకే ‘2.0’ రాబోతోంది. దానికి సంబంధించిన హైప్.. హడావుడి నాలుగైదు రోజుల ముందే మొదలవుతుంది కాబట్టి ఫోకస్ మొత్తం దాని మీదికి వెళ్లిపోతుంది.