సల్మాన్ ఖాన్ చిత్రానికి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. గతంలో ఆయన నటించిన భజరంగీ భాయ్ జాన్ సుల్తాన్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించాయి. ఈ నేపథ్యంలో సల్లూ భాయ్ నటించిన సినిమా కనీసం 300 కోట్లు వసూలు చేస్తుందని బాలీవుడ్ వర్గాలు అంచనా వేశాయి. కానీ సల్మాన్ తాజా చిత్రం ట్యూబ్ లైట్ ఆర్ట్ సినిమాను తలదన్నే రీతిలో ఉండడంతో ఘోర పరాజయాన్ని చవిచూసింది.
ఈ రోజుల్లో ఓ మోస్తరు హిట్ సినిమాలు 100 కోట్ల కలెక్షన్లు అవలీలగా రాబడుతున్నాయి. కానీ ఆ స్థాయిలో కూడా లేని ట్యూబ్ లైట్ మాత్రం ఇప్పటి వరకూ కేవలం రూ. 114 కోట్లను మాత్రమే కలెక్ట్ చేసింది. సల్మాన్ కెరీర్ లోనే ఈ సినిమా ఓ పెద్ద డిజాస్టర్ అని చెప్పవచ్చు. ఈ కలెక్షన్లతో సల్మాన్ కు వచ్చే నష్టం ఏమీ లేదు.
కానీ సల్లూ భాయ్ ని నమ్ముకున్న డిస్ట్రిబ్యూటర్లు నట్టేట మునిగారు. తీవ్రంగా నష్ట పోయిన తమకు నష్ట పరిహారం కావాలంటూ వారు సల్మాన్ ను అడిగారట. దీనికి సల్మాన్ ఖాన్ ఒప్పుకున్నాడని రూ. 55 కోట్ల పరిహారం ఇవ్వబోతున్నాడని ట్రేడ్ వర్గాల సమాచారం. సల్మాన్ దయాగుణానికి డిస్ట్రిబ్యూటర్లు చాలా సంతోషపడిపోయారట.
ప్రస్తుతం సల్మాన్ టైగర్ జిందా హై సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఆయన నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ఏక్ థా టైగర్ కు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటిస్తోంది. సల్లూ భాయ్ ని యాక్షన్ హీరోగా చూడడానికే ఆయన అభిమానులు ఎక్కువగా ఇష్టపడతారు.