శ్రీమంతుడు కథ నాదంటూ శరత్ చంద్ర అనే రచయిత పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఏడాదిన్నర కిందట మొదలైన ఈ వివాదం ఇంకా సద్దుమణగలేదు. తనకు పరిశ్రమలో న్యాయం జరగకపోవడంతో శరత్ చంద్ర కోర్టుకు వెళ్లాడు. మహేష్ బాబు.. కొరటాల శివలతో పాటు నిర్మాతలకు కోర్టు నోటీసులు వెళ్లే వరకు పరిస్థితి వెళ్లింది. ఈ నేపథ్యంలో అసలు శరత్ చంద్ర వాదన ఏంటి.. ఆయన ఏమంటున్నారో చూద్దాం పదండి.
నేను రాసిన చచ్చేంత ప్రేమ నవలను కాపీ కొట్టే శ్రీమంతుడు సినిమా తీశారు. నా నవల చదివిన ఎవ్వరైనా ఈ విషయాన్ని ఒప్పుకుంటారు. నేను ఫేస్ బుక్ లో నా నవలను షేర్ చేస్తే చదివిన వాళ్లందరూ నూటికి నూరు శాతం శ్రీమంతుడు కథ దీన్నుంచి తీసుకుందే అన్నారు. నేను నవలలో దేవరకొండ అని రాస్తే శ్రీమంతుడు సినిమాలో దేవరకోట అని పెట్టారు. అలాగే నా నవలలో తండ్రితో ఘర్షణ తర్వాత కథానాయకుడు గ్రామానికి వెళ్తాడు. సినిమాలో హీరోయిన్ తో ఘర్షణ తర్వాత హీరో గ్రామానికి వెళ్లినట్లు చూపించారు. హీరో హీరోయిన్ ఒకే కాలేజీలో చదవుకోవడం కూడా నా నవల నుంచి తీసుకుందే. నేను రచయితల సంఘంలో ఫిర్యాదు చేశాను. వాళ్లు నన్ను కోర్టుకు వెళ్లమన్నారు. కొరటాల శివకు దీని గురించి చెబితే.. తన సినిమా.. నవల వేర్వేరు అని సమాధానం వచ్చింది. రచయితల సంఘానికి వెళ్లినపుడు బేరసారాలు జరిగాయి. రూ.15 లక్షలు ఇస్తామన్నారు. ఐతే నాకు డబ్బు వద్దు. శ్రీమంతుడు చిత్రాన్ని హిందీలో హృతిక్ రోషన్ తో తీస్తున్నారు కాబట్టి క్రెడిట్స్ ఇవ్వండి అన్నాను.
దాసరి గారి దగ్గరికి వెళ్లాను. ఆయన నాకు సపోర్ట్ చేశారు. నాకు డబ్బులొద్దు. గుర్తింపు కావాలి. ఇండస్ట్రీలో వాళ్లే నన్ను కోర్టుకు వెళ్లమని సలహా ఇచ్చారు. నేను ఎంతగా మెంటల్ స్ట్రైయిన్ అయ్యానో నాకే తెలుసు. మగధీర.. ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు కథా రచయితలకి జరిగినట్లు అన్యాయం జరగకూడదు. న్యాయం చేయాలనేదే నా డిమాండ్. నా నవల చదివి.. దీనికి శ్రీమంతుడుకి దీనికి సంబంధం లేదని ఒక్కరు చెప్పినా.. కేసును విత్ డ్రా చేసుకుంటాను. నా పోరాటాన్ని ఆపను. నేను చనిపోయినా నా కొడుకైనా దీనిపై పోరాటం చేస్తాడు?? అని శరత్ చంద్ర స్పష్టం చేశారు.