నేటి బిజీ కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ ఆనంద డోలికల్లో తేలియాడుతోంది. కారణం ఏమిటంటే, తన అభిమాన నటుడు షారుఖ్ ఖాన్ ని కలుసుకుంది. ఇంకా చెప్పాలంటే, ఆయనే రకుల్ సెట్లోకి వచ్చాడు. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బాలీవుడ్ లో రమేష్ సిప్పీ నిర్మిస్తున్న 'సిమ్లా మిర్చి' సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవల ముంబయ్ లోని మెహబూబ్ స్టూడియోలో జరుగుతుండగా, ఆ పక్కనే షూటింగ్ చేస్తున్న షారుఖ్ ఆ సెట్ కి వచ్చాడు.
రమేష్ సిప్పీతో షారుఖ్ కి ఎంతో అనుబంధం వున్న సంగతి మనకు తెలిసిందే. దాంతో ఆయనను కలవడానికి వచ్చి యూనిట్ అందరితోనూ కాసేపు ముచ్చటించాడు. అప్పుడే రకుల్ ని ఆయనకు పరిచయం చేశారు. "షారుఖ్ సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయనకు వీరాభిమానిని. అలాంటిది ఆయనను తొలిసారిగా కలవడం కల నిజమైనట్టుగా అనిపిస్తోంది. ఆ సమయంలో షారుఖ్ మాతో ఎన్నో కబుర్లు చెప్పాడు" అంటూ మురిసిపోతోంది రకుల్.