ఒక వైపున మహా గాయకుడిగా ఘంటసాల వెలుగొందుతూ వుండగా .. మరోవైపున మధుర గాయకుడిగా బాలసుబ్రహ్మణ్యం దూసుకొస్తూ వుండగా గాయకుడిగా తనదైన ప్రత్యేకతను చాటుకున్నాడు రామకృష్ణ. సాధారణంగా ఒక కొత్త గాయకుడికి కెరియర్ ప్రారంభంలోనే అగ్రస్థాయి నటులకు పాడే అవకాశం లభించదు. కానీ తన తొలిపాటనే 'విచిత్ర బంధం' సినిమాకిగాను ''మనసే ఒక పూలతోట'' పాటను అక్కినేనికి పాడి అందరినీ ఆశ్చర్య చకితులను చేశాడు.
ఇక 'తాత మానవుడు' సినిమాలో ''అనుబంధము .. ఆత్మీయత అంతా ఒక నాటకం'' అనే పాట ఆయనకకి ఎంతో మంచి పేరు తెచ్చిపెట్టింది. సంగీత దర్శకుడు రమేష్ నాయుడు ఈ పాట రిహార్సల్స్ జరుపుతుండగా, ఘంటసాలగారు అక్కడికి వచ్చాడట. మొదటిసారిగా ఘంటసాలను చూసిన రామకృష్ణ పాడటానికి భయపడితే, ఆయనే ధైర్యం చెప్పి పాడించాడట.
అంతే కాకుండా ఈ పాట రికార్డింగ్ జరుగుతూ వుండగా, ఘంటసాలగారు స్వయంగా అక్కడికి వచ్చి రామకృష్ణని అభినందించాడట. గాయకుడిగా మేరుపర్వతంలా కనిపించే ఘంటసాల స్వయంగా రికార్డింగ్ థియేటర్ కి వచ్చి తనని ప్రోత్సహించడం తన జీవితంలో మరిచిపోలేని క్షణాలని రామకృష్ణ ఎన్నో వేదికలపై చెబుతూ వచ్చాడు. రామకృష్ణ శరీరాన్ని వదిలిపెట్టినా .. హుషారైన పాటలతో .. భక్తిరస గీతాలతో ప్రేక్షకుల హృదయాలను ఎప్పటికీ పట్టుకునే ఉంటాడనడంలో సందేహం లేదు.