తెలుగు, తమిళ భాషల్లో నటిగా తనదైన బ్రాండ్ సృష్టించుకున్న అనుష్క, తాజాగా సైజ్ జీరో సినిమా కోసం ఓ పెద్ద సాహసాన్నే చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ఏకంగా 25 కేజీల బరువు పెరిగి నటనపై, సినిమాలపై తనకున్న మక్కువను చూపుకున్నారు. ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందిన సైజ్ జీరో సినిమా నవంబర్ 27న పెద్ద ఎత్తున విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే విడుదలై ఆడియో, ట్రైలర్స్ ఈ సినిమాపై విపరీతమైన ఆసక్తి రేకెత్తించాయి.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ సినిమాను ప్రేక్షకులకు మరింత దగ్గర చేయాలన్న ఆలోచనలో సైజ్ జీరో టీమ్ ఓ సరికొత్త ప్రచారానికి తెరలేపింది. ఇండియన్ సినిమాలోనే ఇప్పటివరకూ ఏ సినిమాకూ చేయనటువంటి తరహాలో సౌత్ సెంట్రల్ రైల్వేలో కొన్ని రైళ్ళతో సైజ్ జీరో టీమ్ కొత్త ప్రచారాన్ని మొదలుపెట్టింది. ఈ తరహా ప్రమోషన్స్లో భాగంగా ఆ రైళ్ళలో మొత్తం సైజ్ జీరోకు సంబంధించిన పోస్టర్స్, స్టిల్స్ను ఏర్పాటు చేశారు. ఈ తరహా ప్రమోషన్ కొత్తగా ఉండడంతో ప్రయాణికులు కూడా ఈ ప్రమోషన్ను ఆసక్తికరంగా గమనిస్తున్నారు. ఇక విడుదలకు ముందు ఇన్ని అంచనాలను రేకెత్తిస్తోన్న ఈ సినిమా ఆ అంచనాలను అందుకునే రేంజ్లో ఉంటుందా తెలియాలంటే ఈ నెలాఖరు వరకూ ఎదురుచూడాల్సిందే!