స్వామి రారా సినిమాతో టాలీవుడ్లోకి దూసుకొచ్చాడు యువ దర్శకుడు సుధీర్ వర్మ. ఈ సినిమాతో ఒక్కసారిగా అతడిపై అంచనాలు పెరిగిపోయాయి. ఐతే బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ లాంటి పెద్ద నిర్మాతతో.. నాగచైతన్య లాంటి క్రేజున్న హీరోతో సినిమా చేసే అవకాశం లభించినా అతను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. సుధీర్ రెండో సినిమా దోచేయ్ తీవ్రంగా నిరాశ పరిచింది. ఐతే ఆ ఫలితం నుంచి బయటపడి.. కేశవ లాంటి ఇంటెన్స్ రివెంజ్ డ్రామాను తెరకెక్కించాడు సుధీర్. ఈ సినిమా ప్రోమోలు చూస్తే వావ్ అనిపిస్తున్నాయి. సినిమా మీద కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. సినిమా కచ్చితంగా హిట్టవుతుందని ఇండస్ట్రీ జనాలు అంచనా వేస్తున్నారు.
కేశవ ఫలితమేంటో తేలకముందే సుధీర్ తన తర్వాతి సినిమాను ఓకే చేసుకున్నట్లు సమాచారం. వరుసగా నాలుగు హిట్లతో ఊపుమీదున్న శర్వానంద్ తో సుధీర్ తన తర్వాతి సినిమా చేయబోతున్నాడట. ఓ కథ మీద ఇద్దరూ అండర్ స్టాండింగ్ కు వచ్చినట్లు సమాచారం. కేశవ కు భిన్నంగా ఈసారి ఎంటర్టైనర్ చేయబోతున్నాడట సుధీర్. ఓ పెద్ద నిర్మాత ఈ చిత్రాన్ని నిర్మిస్తాడని తెలుస్తోంది. రన్ రాజా రన్ తో మొదలుపెట్టి శతమానం భవతి వరకు విన్నింగ్ స్ట్రీక్ కొనసాగిస్తున్నాడు శర్వా. అతడి కొత్త సినిమా రాధ మే 12న రాబోతుంటే.. వారం తర్వాత సుధీర్ మూవీ కేశవ ప్రేక్షకుల్ని పలకరించబోతుండటం విశేషం