తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయిన నేపథ్యంలో సినీ పరిశ్రమ హైదరాబాదు నుంచి అమరావతి(విజయవాడ)కి తరలివెళ్లే అవకాశాలు ఇప్పటికైతే లేవని ప్రముఖ నటుడు సుమన్ అన్నారు. పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాదుకు తరలివచ్చిన సమయంలో హైదరాబాదులో ధరలు తక్కువగా ఉండేవని, ఇప్పుడు కొత్త స్టుడియోలు కూడా వచ్చే అవకాశం ఉన్నందున హైదరాబాదే టాలీవుడ్ కు కేంద్రంగా ఉంటుందని పేర్కొన్నారు. అవయవదానంపై అవగాహన కల్పించేందుకు కర్ణాటకలోని కోలారులో ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో సుమన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు.
విజయవాడలో ప్రస్తుతం ఉన్న ధరల దృష్ట్యా సినీ పరిశ్రమ అక్కడకు తరలి వెళ్లడమనేది ఖర్చుతో కూడుకున్న పని అని, హైదరాబాద్ లోనే కొనసాగుతుందని సుమన్ అభిప్రాయపడ్డారు. స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ.. హంద్రీ-నీవా ద్వారా చిత్తూరు జిల్లాకు వచ్చే కృష్ణా జలాలు కోలారు(కర్ణాటక) జిల్లాకు కూడా సరఫరా చేసేందుకు అవకాశం ఉంటే.. సీఎం చంద్రబాబుతో ఆ విషయాన్ని చర్చిస్తానని అన్నారు. తన సినీ కేరీర్లో అన్నమయ్యలో చేసిన వెంకటేశ్వరస్వామి పాత్ర ఎంతో ఇష్టమైందని, రజనీకాంత్తో శివాజీ చిత్రంలో చేసిన విలన్ పాత్ర పేరు తీసుకువచ్చిందన్నారు. కన్నడలో మంచి పాత్ర లభిస్తే తప్పక చేస్తానన్నారు.