కథానాయకుడిగా మారాక సునీల్ ప్రయాణం కొన్నాళ్లపాటు సజావుగానే సాగింది. మాస్ కథలూ ఆయన దగ్గరికి వచ్చాయి. అయితే ఆ కథలన్నీ కూడా ఒకే తరహాలో ఉండటంతోనే సునీల్ కి సమస్యగా మారింది. ఇటీవలికాలంలో వచ్చిన ఆయన సినిమాలన్నీ కూడా పరాజయాన్నే చవిచూశాయి. బీ - సీ సెంటర్లలో వసూళ్లు కొంతవరకు ఫర్వాలేదనిపించినా మిగతా చోట్ల మాత్రం ఆ సినిమాలు ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయాయి. కొన్ని రోజుల క్రితమే విడుదలైన `ఈడు గోల్డ్ ఎహే` అయితే ఎప్పుడొచ్చిందో - ఎప్పుడు థియేటర్ నుంచి వెళ్లిపోయిందో అర్థం కాని పరిస్థితి.
ఆ పరాభవం ప్రభావంతో సునీల్ కూడా కమెడియన్ పాత్రలపై దృష్టిపెట్టే ఆలోచనలో ఉన్నాడని చెప్పుకొన్నారు. ఆ మాటలు వినిపిస్తున్న దశలోనే `టూ కంట్రీస్` రీమేక్ కూడా ఆగిపోయిందనే ప్రచారం మొదలైంది. సునీల్ మార్కెట్ ని చూసి దర్శకనిర్మాత శంకర్ వెనక్కి తగ్గాడని మరో కథానాయకుడిని ఎంచుకొనే ఆలోచనలో ఉన్నాడని చెప్పుకొన్నారు. కానీ ఆ ప్రచారంలో నిజం లేదని తేలిపోయింది. వచ్చే నెల 7 నుంచే చిత్రీకరణ మొదలుపెట్టనున్నట్టు శంకర్ వెల్లడించాడు. దీన్నిబట్టి సునీల్ తన కెరీర్ ని నిలబెట్టుకొనే దిశగా అడుగులేస్తున్నట్టే అర్థమవుతోంది. నిజానికి శంకర్ కూడా తర్జనభర్జనలు పడ్డాడని కానీ సునీల్ చొరవ తీసుకొని ధైర్యం చెప్పడంతోనే సినిమా మూవ్ అవుతోందనేది ఫిల్మ్ నగర్ వర్గాల మాట.