రచయితగా లేడీస్ టైలర్.. శివ సహా ఎన్నో గొప్ప చిత్రాలకు పని చేశాడు తనికెళ్ల భరణి. దర్శకుడిగా మారి మిథునం లాంటి మంచి సినిమాను అందించాడు. కానీ ఇప్పుడు ఆయన రచనా చేయట్లేదు.. దర్శకత్వమూ ఆపేశాడు. ఐతే రచయితగా ఇప్పుడు తాను ఇమడలేనేమో అనే.. సినిమాలకు రాయట్లేదంటున్న భరణి.. దర్శకుడిగా మంచి సినిమాలు తీద్దామని ఉందని.. కానీ అలాంటి సినిమాలు తీసే నిర్మాతలు దొరకట్లేదని చెప్పాడు.
??నేను ఇప్పుడు రచయితగా కొనసాగకపోవడానికి కారణం.. ఈ కాలానికి నా రచన తగదనే. ఒక్కో పీరియడ్లో ఒక వ్యవహారం నడుస్తుంది. నాకంటే మేధావులు.. నాకంటే గొప్ప స్పార్క్ ఉన్న రచయితలు వస్తున్నారు. నేను రచయితగా కొనసాగడం లేదని కాదు. ఐతే సినిమాలకు చేయడం తగ్గించేశాను. రచయితగా ఈ ట్రెండుకి నేను సరిపోనేమోనని అనుకుంటున్నా. దర్శకత్వం విషయానికి వస్తే.. తెలుగువాడు.. తెలుగుజాతి అంతర్జాతీయంగా తలెత్తుకునేలా.. అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో తెలుగు సినిమాకి స్థానం దక్కేలా చేయాలని ఉంది. చాలా స్క్రిప్టులున్నాయి. కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు నాకు నచ్చిన అంశాలతో కథలు ఉన్నాయి. ఐతే పెట్టిన డబ్బులు వాళ్లకి వస్తేనే కదా ఏ నిర్మాత అయినా ఇంకో సినిమా తీస్తారు. కాబట్టి నాకు నిర్మాతలు కావలెను. దర్శకత్వానికి రెడీ?? అని భరణి చెప్పారు.