బాహుబలి.. భారతీయ సినీ చరిత్రలో ఓ అపూర్వఘట్టం. ఓ ప్రాంతీయ చిత్రం ఎంతటి చరిత్ర సృష్టించగలదో నిరూపించిన సినిమా. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ విజువల్ వండర్లో ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, సత్యరాజ్, అనుష్క, తమన్నాలు ప్రధాన పాత్రల్లో నటించారు. భారీ బడ్జెట్తో ఏళ్ల తరబడి తెరకెక్కించిన ఈ సినిమా మొదలై నేటికి మూడేళ్లు. ఈ విషయాన్ని తమ అఫీషియల్ ఫేస్బుక్ పేజ్లో ప్రకటించిన చిత్రయూనిట్... షూటింగ్ మొదలైన నాటి ఫోటోలను కూడా పోస్ట్ చేశారు.
'ఈ ప్రయాణంలో ఎన్నో గుర్తులు, విజయాలు.. మాతో కలిసి ప్రయాణించిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు' అంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం బాహుబలి పార్టు షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సినిమా క్లైమాక్స్లో వచ్చే భారీ యుద్ధసన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. తొలి భాగాన్ని మించేలా మరింత భారీగా ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి టెక్నిషియన్స్ బాహుబలి పార్ట్ 2 కోసం పనిచేస్తున్నారు. ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి 2017 సమ్మర్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.