స్టార్ హీరోయిన్ త్రిష ప్రధాన పాత్రలో నటించిన నాయకి సినిమా కొద్దికాలం క్రితం మంచి అంచనాలను రేకెత్తించిన విషయం తెలిసిందే. దర్శక ధీరుడు రాజమౌళి ప్రశంసలు కూడా దక్కించుకున్న ఈ సినిమా ఫస్ట్లుక్ అప్పట్లో మంచి ఆసక్తి రేకెత్తించింది. ఇక ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి నుంచీ ప్రేక్షకుల ముందుకు ఇప్పుడు వస్తుందీ, అప్పుడు వస్తుందీ అని వాయిదా పడుతూ వచ్చి చివరకు ఈనెల 8వ తేదీకి ఫిక్స్ అయింది.
సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకున్న ఈ సినిమా 8వ తేదీకి పక్కాగా వచ్చేస్తుందని అనుకుంటుండగా, చివరి నిమిషంలో మళ్ళీ వాయిదా పడింది. తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి విడుదల కావాల్సిన ఈ సినిమా తమిళ వర్షన్ సెన్సార్ ఇంకా పూర్తి కానందున జూలై 15కు సినిమాను వాయిదా వేసినట్లు దర్శకుడు గోవీ స్పష్టం చేశారు. త్రిషతో పాటు గణేష్ వెంకట్రామన్, సత్యం రాజేష్, జేపీ, మాధవి లత, సుష్మా రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాను గిరిధర్ నిర్మించారు.