దర్శకుడు వంశీ అనే పేరు కనిపించిన తెరపై భారీ ఖర్చు కనిపించదు .. అందమైన కథ కనిపిస్తుంది. ఆయన సినిమాల్లోని పాటలు ఫారిన్లో పరుగులు తీయవు .. చెరువు గట్టునే విహరిస్తూ చెరుకు రసాన్ని మరిపిస్తుంటాయి. వంశీ సినిమాల్లో అనవసరమైన హడావిడి కాకుండా .. మనసుకుకి హత్తుకునే ఫీల్ మాత్రమే కనిపిస్తుంది. అలా తెరకెక్కిన ఓ అనుభూతి ప్రధానమైన చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఆ సినిమా పేరే 'మెల్లగా తట్టింది మనసు తలుపు'.
అజ్మల్ .. నిఖితా నారాయణ్ ఇందులో నాయకా నాయికలు. నిజానికి 'తను మొన్నే వెళ్లిపోయింది' పేరుతో ఈ సినిమా కొంతకాలం క్రితమే షూటింగ్ జరుపుకుంది. అనివార్య కారణాల వలన ఆగిపోయిన ఈ సినిమాను పూర్తి చేసి, కథకి తగినట్టుగా 'మెల్లగా తట్టింది మనసు తలుపు' అనే టైటిల్ ను ఖరారు చేసి విడుదలకి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత డి.వెంకటేష్ మాట్లాడుతూ .. వంశీ దర్శకత్వంలో వస్తోన్న 25 వ సినిమాగా ఈ సినిమా ప్రత్యేకతను సంతరించుకుందనీ, ఆడియన్స్ ఆదరిస్తారనే నమ్మకముందంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.