ఎవడే సుబ్రమణ్యం సినిమాతో తెలుగు పరిశ్రమకు దర్శకుడిగా పరిచయమై మంచి గుర్తింపు తెచ్చుకున్న నాగ్ అశ్విన్, తాజాగా ప్రముఖ నటి సావిత్రి జీవిత కథతో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే స్క్రిప్ట్ సహా అన్నీ పక్కాగా సిద్ధం చేసుకున్న ఆయన, సావిత్రి పాత్ర కోసం చాలామంది పేర్లను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం మాకు అందిన సమాచారం మేరకు బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్లో ఒకరైన విద్యా బాలన్ను సావిత్రి పాత్ర కోసం సంప్రదించినట్లు తెలుస్తోంది.
విద్యా బాలన్కు అన్ని భాషల్లో మంచి క్రేజ్ ఉండడంతో పాటు, నిజ జీవిత పాత్రలు చేయడంలో ఆమెకున్న పేరు కూడా కలిసి వస్తుందని టీమ్ ఆమెను సంప్రదించారని సమాచారం. ఇక విద్యా బాలన్ కూడా ఈ ప్రాజెక్టుకు దాదాపుగా ఓకే చెప్పే అవకాశమే ఉందని తెలుస్తోంది. అయితే ఈ విషయమై టీమ్ నుంచి ఇంకా స్పష్టమైన ప్రకటన రావాల్సి ఉంది. చిన్నప్పట్నుంచీ సావిత్రి సినిమాలు చూస్తూ పెరిగిన తనకు, మహానటి అంటే ఆవిడే గుర్తొస్తారని, అందుకే ఆవిడ కథతోనే సినిమా తీస్తున్నట్లు నాగ్ అశ్విన్ ఈ ప్రాజెక్టు మొదలుపెట్టినప్పట్నుంచీ చెబుతూ వస్తున్నారు.