పూలరంగడు.. లాంటి సినిమాలు సాధించి విజయాలు చూసి సునీల్ టాలీవుడ్లో మరో రాజేంద్ర ప్రసాద్ అయిపోతాడేమో అనుకున్నారంతా. కానీ కామెడీకి కట్టుబడకుండా మాస్ హీరో ఇమేజ్ కోసం పాకులాడి కెరీర్ ను దెబ్బ తీసుకున్నాడతను. మిస్టర్ పెళ్లికొడుకు తో మొదలుపెట్టి.. గత ఏడాది వచ్చిన ఈడు గోల్డ్ ఎహే వరకు అన్నింట్లోనూ సునీల్ మాస్ హీరో ఇమేజ్ కోసం పడ్డ తాపత్రయం.. అతను చేసిన విన్యాసాలు చూసి జనాలకు అతడి మీద ఉన్న ఫీలింగే మారిపోయింది. ఈ దెబ్బకు సునీల్ కొత్త సినిమా ఉంగరాల రాంబాబు పై ప్రేక్షకుల్లోనే కాదు.. ట్రేడ్ వర్గాల్లో కూడా పెద్దగా ఆసక్తి లేకుండా పోయింది. ఈ సినిమాకు బిజినెస్ కాక విడుదలకు నోచుకోవట్లేదని అంటున్నారు.
ఐతే ఉంగరాల రాంబాబు సంగతి తేల్చకుండానే ఇంకో సినిమా మొదలుపెట్టి.. దాని షూటింగ్ కూడా పూర్తి చేసేశాడు సునీల్. ఎన్ కౌంటర్ శంకర్ దర్శకత్వంలో సునీల్ హీరోగా మలయాళ బ్లాక్ బస్టర్ 2 కంట్రీస్ ను రీమేక్ చేయబోతున్నట్లు గత ఏడాది ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. కొన్ని నెలల కిందటే ఈ చిత్రం చడీచప్పుడు లేకుండా సెట్స్ మీదికి వెళ్లిపోయింది. షూటింగ్ అయిపోయిందని.. త్వరలోనే సినిమా విడుదలవుతుందని చెబుతూ ప్రెస్ మీట్ కూడా పెట్టేసింది చిత్ర బృందం. ఈ సినిమాకు మలయాళ టైటిలే ఖరారు చేశారట. 2 కంట్రీస్ పేరుతోనే తెలుగులోనూ రిలీజవుతుందట. ఈ సినిమాలో ఓ కొత్తమ్మాయి సునీల్ సరసన కథానాయికగా నటిస్తోంది.