మణిరత్నం దర్శకత్వంలో ఒక్కసారైనా నటించాలని.. ఆయన సినిమాలో చిన్న పాత్ర అయినా చేయాలని దక్షిణాదిన ప్రతి నటుడు.. నటి ఆశపడతారు. ఆ మాటకొస్తే బాలీవుడ్ వాళ్లకు కూడా మణిరత్నంతో నటించడానికి ఎంతో ఆసక్తి చూపిస్తారు. ఐతే మణిరత్నం ఇప్పుడు తాను కోరుకుంటున్న నటీనటులు మాత్రం ఆయనతో సినిమా చేయడానికి అంత ఆసక్తితో లేనట్లు తెలుస్తోంది. చెలియా రిజల్ట్ చూశాక మణిరత్నం సినిమా అంటే చాలామంది భయపడుతున్నారట.
ఆల్రెడీ మణిరత్నంతో చేయాల్సిన రామ్ చరణ్ వెనక్కి తగ్గినట్లుగా చెబుతున్నారు. మరోవైపు మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టిని సంప్రదించి తిరస్కారం అందుకున్నాడట మణి. సూపర్ స్టార్ రజినీకాంత్ కోసం కూడా ఆయన ప్రయత్నించారని.. రజినీ నుంచి సానుకూల స్పందన రాలేదని అంటున్నారు. దీంతో ఎవరితో సినిమా చేయాలో పాలుపోని పరిస్థితిలో మణి ఉన్నట్లుగా కోలీవుడ్లో మీడియాలో వార్తలొస్తున్నాయి.
తాజా సమాచారం ప్రకారం మణిరత్నం కొత్త సినిమాలో నటించడానికి ఐశ్వర్యారాయ్ మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. మణిరత్నంతో గాడ్ ఫాదర్ లాగా భావించే ఐశ్వర్య ఆయనకు ఎప్పుడూ నో చెప్పింది లేదు. ఇద్దరు సినిమాతో ఐశ్వర్యను కథానాయికగా పరిచయం చేసింది మణిరత్నమే. ఆ సినిమా ఫ్లాప్ అయినా ఐశ్వర్యకు మంచి పేరొచ్చింది. ఆ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్లో గురు.. రావణ్ సినిమాలు వచ్చాయి.