నటుడు జెడి చక్రవర్తి చాలా రోజుల తర్వాత కొత్త ప్రాజెక్ట్ చేయనున్నాడు. వర్మ శివ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఆయన ఆ తర్వాత గులాబీ, దెయ్యం, మనీ, మనీ మనీ,ప్రేమకు వేళాయరా వంటి హిట్ చిత్రాల్లో హీరోగా నటించి మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత వరుస పరాజయాలు ఎదురవడంతో విలన్ గా, సపోర్టింగ్ ఆర్టిస్టుగా మారి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటించిన అయన తెలుగులో చివరగా మంచు విష్ణు ‘డైనమైట్’ చిత్రంలో ప్రతి నాయకుడి పాత్రలో కనిపించారు.
ప్రస్తుతం ఆయన ప్రధాన పాత్రలో అమ్మ రాజశేఖర్ ఒక కొత్త చిత్రాన్ని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. అమ్మ రాజశేఖర్ కొరియోగ్రఫర్ నుండి దర్శకుడిగా మారి రణం, ఖతర్నాక్ వంటి సినిమాలని రూపొందించారు. ఇకపోతే వీరి ప్రాజెక్ట్ ఈ నెల 15నుండి మొదలవుతుందని అంటున్నారు. అయితే ఈ చిత్రం గురించిన అధికారిక ప్రకటన ఇంకా బయటకి విడుదలకావల్సి ఉంది