తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్ వచ్చాకే వాళ్ల మకాం కూడా ఇక్కడికి మారింది. కాబట్టే మన హీరోలకు తమిళం బాగా తెలుసు. చక్కగా మాట్లాడగలరు. అవతలి వాళ్లు చెప్పేది అర్థం చేసుకోనూ గలరు. నందమూరి బాలకృష్ణ కూడా ఆ కోవలోని వాడే. ఆయనకు తమిళం మీద మంచి పట్టుంది. ఆ పట్టును ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ఆడియో వేడుకలో చూపించాడు బాలయ్య. అక్కడ ఆయన సుదీర్ఘం.. దాదాపు పది నిమిషాల పాటు తమిళంలోనే మాట్లాడటం విశేషం. తాను తమిళనాట పుట్టిన బిడ్డనని.. ఈ రాష్ట్రంతో తనకు గొప్ప అనుబంధం ఉందని అన్నాడు బాలయ్య.
తమిళ లెజెండరీ యాక్టర్లైన ఎంజీఆర్.. శివాజీలను పెరియప్పా (పెదనాన్న).. చిత్తప్పా (చిన్నాన్న) అని సంబోధించడం ద్వారా అక్కడి జనాల మనసులు గెలిచాడు బాలయ్య. అంతే కాదు గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాను శివాజీ నటించిన వీరపాండ్య కట్టబొమ్మన్ సినిమాతో పోల్చిన బాలయ్య.. అందులో శివాజీ పలికిన పవర్ ఫుల్.. లెంగ్తీ డైలాగ్ ను అలాగే అప్పజెప్పేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఐతే గౌతమీపుత్ర శాతకర్ణి ని తెలుగులో ప్రమోట్ చేసేటపుడు ఇది తెలుగువారి ఆత్మగౌరవానికి సంబంధించిన సినిమా అంటూ చెప్పిన బాలయ్య... చెన్నైలో మాత్రం భిన్నమైన మాటలు మాట్లాడాడు. ఇది తెలుగు సినిమా కాదని.. ఇండియన్ సినిమా అని అన్నాడు. ఈ చిత్రం తమిళ ప్రేక్షకుల్ని కూడా బాగా ఆకట్టుకుంటుందని బాలయ్య ఆశాభావం వ్యక్తం చేశాడు.