నందమూరి బాలకృష్ణ ఇప్పుడు శతచిత్ర హీరోగా అవతరిస్తున్నారు. గౌతమి పుత్ర శాతకర్ణి మూవీతో సెంచరీ కొట్టనున్న బాలయ్య.. ఈ చిత్రం ఘనవిజయం సాధించేందుకు బోలెడంత కష్టపడుతున్నారు. బాలయ్య కొట్టబోయే బ్లాక్ బస్టర్ కోసం అభిమానులు కూడా ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. మరికొందరు ఫ్యాన్స్ అయితే.. తమ అభిమాన హీరో నటిస్తున్న వందో సినిమా ఘన విజయం సాధించాలంటూ.. దేశవ్యాప్తంగా వంద దేవాలయాలలో పూజా కార్యక్రమాల కోసం ఆధ్యత్మిక యాత్ర ప్రారంభించారు.
రీసెంట్ గా ప్రారంభమైన ఈ యాత్రను స్వయంగా బాలకృష్ణ జెండా ఊపి ప్రారంభించడం విశేషం. ఈ సమయంలో గౌతమిపుత్రి శాతకర్ణి దర్శకుడు క్రిష్.. నిర్మాత సునీల్ రెడ్డి కూడా అక్కడే ఉన్నారు. ఆ కారు యాత్ర ద్వారా దేశంలోని 100 ప్రధాన దేవాలయాల్లో గౌతమిపుత్ర శాతకర్ణి విజయం కోసం పూజలు చేయనున్నారు అభిమానులు. శాతకర్ణి రిలీజ్ సయమానికి తిరిగి యాత్ర పూర్తి చేసేలా ప్లాన్ చేసుకున్నారట. సంక్రాంతి పండుగ కానుకగా గౌతమిపుత్ర శాతకర్ణి జనవరి 11న థియేటర్లలోకి రానుండగా.. డిసెంబర్లో ఆడియో ఫంక్షన్ ను.. థియేట్రికల్ ట్రైలర్ ను గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.
ఈ మధ్యన మెగా ఫ్యాన్స్ కూడా ఇలాగే 150వ సినిమా ఖైదీ నెం 150 ఫస్ట్ లుక్ రిలీజ్ సమయంలో ఆంధ్రప్రదేశ్ లోని అనేక గుళ్ళలో ప్రత్యేక పూజలు చేయించారు. చూస్తుంటే సినిమాలు హిట్టవ్వాలని ఈ మధ్యన దైవ బలం కూడా ఫ్యాన్స్ తెగ కోరుకుంటున్నారు. అంతే కదూ?