హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమానికి హీరో దగ్గుబాటి రానా తనవంతుగా మద్దతు తెలిపాడు. సోమవారం ఉదయం అతడు నానక్రామ్ గూడలో రెండు మొక్కలు నాటాడు. ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని విజ్ఞప్తి చేశాడు. అలాగే నాటిన మొక్కను పరిరక్షించాల్సిన బాధ్యత కూడా ప్రతి ఒక్కరిపై ఉందని, అందరూ హరితహారం కార్యక్రమంలో పాల్గొనాలని కోరాడు.
'గుడ్ మార్నింగ్!! దిస్ ఈజ్ హౌ మై డే బిగెన్! ట్రీ ప్లాంటేషన్ ఇన్ నానక్ రామ్ గూడ!!మేక్ యూఆర్ ఆల్సో గ్రీన్!! అంటూ రానా ట్విట్ చేశాడు. కాగా హరితహారంలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు సినీనటులు హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు.