గతంలో అయితే 60-70 రోజుల పాటు ఒక్కో సినిమా షూటింగ్ సాగింది. కొన్ని సినిమాలకు టైం ఎక్కువ పట్టినా.. వాటి జోనర్ వేరే. మరి కొన్ని సినిమాలైతే ఇంకా చకాచకా తెరకెక్కేసి.. అంతకంటే వేగంగా థియేటర్లలోకి వస్తున్నాయి. ఇలా పక్కాగా ప్లానింగ్ చేసి మూవీస్ రూపొందించడంలో ఈ జనరేషన్ లో దిల్ రాజుకు మించిన నిర్మాత వేరొకరు లేరు అంటారు.
అలాంటి ప్రొడ్యూసర్ కు కూడా ఓ దర్శకుడు చిరాకు తెప్పించేస్తున్నాడట. ఆయన ఎవరో కాదు.. శేఖర్ కమ్ముల. ప్రస్తుతం వరుణ్ తేజ్ హీరోగా.. మలయాళ భామ సాయి పల్లవి హీరోయిన్ గా ఫిదా అనే చిత్రాన్ని రూపొందిస్తున్నాడు ఈ డైరెక్టర్. చాలా నెలలుగా ఈ సినిమా షూటింగ్ సాగుతూనే ఉంది. ఇంకా తీయాల్సిన భాగం కూడా చాలానే ఉందట. మొత్తం షూటింగ్ టైం 100 రోజులు దాటిపోతోందని అంటున్నారు. ఓ లవ్ స్టోరీ కోసం ఇంత టైం తీసుకోవడంతో బాగా ఫ్రస్టేట్ అవుతున్నాడట దిల్ రాజు.
ఒకవైపు అల్లు అర్జున్ తో తీస్తున్న హై బడ్జెట్ మూవీ దువ్వాడ జగన్నాధంకు ఏర్పడిన క్రేజ్.. జరుగుతున్న బిజినెస్ ను చూసి హ్యాపీగా ఫీల్ అవ్వాలో.. మీడియం బడ్జెట్ తో రూపొందిస్తున్న ఫిదా షూటింగ్ డిలే అవుతున్నందుకు వర్రీ అవ్వాలో తెలియని పరిస్థితి ఏర్పడిందట దిల్ రాజుకి.